CM Revanth Reddy : ఏపీలో రూ.10 వేల కోట్ల బకాయిలు.. అక్కడ ఎందుకు ప్రశ్నించరు.?

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీని నిలదీసిన సీఎం
  • గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ₹8 వేల కోట్ల బకాయిలు పెట్టిందన్న రేవంత్
  • ఏ ఏడాది బకాయిలు ఆ ఏడాదే చెల్లిస్తామని హామీ
  • టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో పారదర్శకంగా నిర్వహిస్తామన్న సీఎం
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని, అక్కడ ఎన్డీఏ (NDA) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేశారు. ‘నవ్వితే నాకేటి సిగ్గు’ అన్నట్లుగా బీజేపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని, బీఆర్‌ఎస్‌కు వంతపాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ నిర్వాకమే నేటి ఆర్థిక భారం

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఎగవేతల వల్లే ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం నేడు పెద్ద ఆర్థిక భారంగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం ఏకంగా రూ. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెట్టి వెళ్లిందని ఆయన గుర్తుచేశారు. ఆనాడు ఈ బకాయిలపై మాట్లాడని నేతలు, నేడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్ కృష్ణయ్య, కిషన్ రెడ్డి వంటి నేతలు ఏపీలోని బకాయిలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.

ఏ ఏడాది బకాయిలు ఆ ఏడాదే చెల్లిస్తాం!

ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులు, కళాశాలల యజమాన్యాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యే లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును ఏ ఏడాదిది ఆ ఏడాదే క్రమం తప్పకుండా చెల్లిస్తామని స్పష్టం చేశారు. దీనికోసం ముందస్తుగా (అడ్వాన్స్‌గా) బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం అమలు కోసం సంవత్సరానికి దాదాపు రూ. 2,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వివరించారు.

టీజీపీఎస్సీలో పారదర్శకత.. యూపీఎస్సీ తరహా నిర్వహణ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పనితీరుపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, కమిషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తరహాలో ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోకుండా ప్రతి పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ‘గ్లోబరీనా’ వంటి వివాదాస్పద సంస్థపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే సిబిఎస్ఈ లో సైతం అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా కట్టుదిట్టమైన పద్ధతుల్లో నియామక ప్రక్రియలను కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.