Rachakonda: మామూలు దొంగ కాదు.. ఏ ఇంట్లో దొంగతనం చేయాలో కల వస్తుందట..!

మోస్ట్ వాంటెడ్ ఘరానా దొంగను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు… హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 43 ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.. అతడే ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు… అతడి వద్ద నుంచి కోటి 30 లక్షల విలువచేసే 230 తులాల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, 18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. అయితే, ఏ రంగంలో రాణించాలన్నా కొన్ని మెలుకువలు అవసరం.. ఇక్కడ మన దొంగ గారి తెలివితేటలు చూస్తే మైండ్‌ బ్లాక్‌ అవుతుంది.. ఎందుకంటే.. ఈ దొంగకు కల వస్తుందంట.. ఈ రోజు ఏ ఇంట్లో దొంగతనం చేయాలో.. దాని ప్రకారం ఆ రోజు పనికానిచ్చేస్తాడన్నమాట. మరో విషయం ఏంటంటే.. ఈ రోజు దొంగతనం చేయాలా? వద్దా? అనే చిట్టీలను కూడా ఫాలో అవుతాడు రాజు.. రెండు చిట్టీలను వేసి.. అందులో దొంగతనం చేయొచ్చు అనే చిట్టీ వస్తేనే ఆ రోజు దొంగతనం చేస్తాడట.

Read Also: Punjab: పంజాబ్‌ అసెంబ్లీ కీలక తీర్మానం

మొత్తంగా పదేళ్ల నుంచి దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు.. అప్పటి నుండి దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను తన దగ్గరే ఉంచుకుంటున్నాడు.. దీంతో.. ఎక్కడా అనుమానం రాకుండా పోయింది.. ఇప్పటి వరకు అలా రెండు కిలోలకు పైగా బంగారు ఆభరణాలు కూడబెట్టాడు రాజు.. పదేళ్ల నుంచి దొంగతనాలు చేస్తున్నా ఇప్పటి వరకు అరెస్ట్‌ కాలేదు ఈ ఘరానా కేటుగాడు… ఇప్పటి వరకు వనస్థలిపురంలో 27, హయత్‌నగర్‌లో 2, పహడీషరీఫ్‌లో 4, కుషాయిగూడలో 7, మహబూబ్‌నగర్‌లో 2 చోట్ల దొంగతనాలు చేసినట్టుగా చెబుతున్నారు.. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌పై జీవిస్తాడు.. కానీ, సొంత ఊర్లో మాత్రం మూడంతస్తుల బిల్డింగ్‌ కట్టాడని గుర్తించారు.