మూఢనమ్మకాల మాయలో పడి ప్రజలు నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు. వాళ్లను నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకుని డబ్బులు దోచుకుంటున్నారు నకిలీ బాబాలు.. ఇలాంటి ఫేక్ బాబాలను రాచకొండ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. అంతర్ రాష్ట్ర నకిలీ బాబా ముఠాను అరెస్ట్ చేసామని తెలిపారు. భువనగిరి ఎస్వోటీ, భువనగిరి టౌన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ తో ముఠాను అరెస్ట్ చేసామన్నారు. రాజస్థాన్ లోని సీరోహి అనే ప్రాంతం నుండి వచ్చి మోసం చేస్తున్నారని తెలిపారు. అనేక పూజలు చేసి జబ్బులు నయం చేస్తాం అంటూ మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కొండల్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామన్నారు.
భువనగిరికి చెందిన కొండల్ రెడ్డి ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే కొండల్ రెడ్డి కొద్దిరోజుల ముందు బైక్ మీద నుండి కింద పడ్డారు. తనకు సర్ప దోషం ఉందని, పూజ చెయ్యకపోతే ప్రాణాలు పోతాయని కొండల్ రెడ్డి ని నమ్మించి మోసం చేసారని తెలిపారు. కొండల్ రెడ్డి వద్దనుంచి సర్ప దోషం పేరుతొ దగ్గర 37 లక్షలు 71 వేలు వసూలు చేశారని అన్నారు. దీంతో పోలీసులను కొండల్ రెడ్డి ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చిందని పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసామని తెలిపారు. వారి వద్దనుంచి నగదు 8 లక్షలు, కౌంటింగ్ మిషన్, రుద్రాక్ష మాలలు పూజా సామానుస్వాదినం చేసుకున్నట్లు వివరించారు. ఇక్కడే కాకుండా పలు రాష్ట్రాల్లో ఇదే విధంగా మోసం చేసినట్టు వెల్లడైందని మహేష్ భగవత్ పేర్కొన్నారు.