సమాజాన్ని మార్చే ఏకైక ఆయుధం విద్య. ముఖ్యంగా సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాలు మారాలన్నా అందరితో సమానంగా అవకాశాలు దక్కించుకోని వృద్ధిలోకి రావాలన్నా ఆయా వర్గాలను విద్యా వంతులను చేయడమే ఏకైక మార్గమని మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహానీయులు విశ్వసించడమే కాదు అందుకోసం ఎంతో కృషి చేశారు. ఆ మహానీయుల స్ఫూర్తిని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. బీసీ రిజర్వేషన్లను పెంచడం, ఎస్సీ వర్గీకరణ వంటి విధాన నిర్ణయాలకే పరిమితం కాకుండా వారి బిడ్డలను ప్రయోజకులను చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తోంది.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి వంటి పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధులకు అంతర్జాతీయ వర్సిటీల్లో పీజీ, పీహెచ్డీ కోర్సులు చదివేందుకు ప్రభుత్వం స్కాలర్షిప్ రూపంలో చేయూతను అందిస్తోంది. ఈ పథకాలు అమల్లోకి వచ్చినప్పటితో పోలిస్తే ఆశావాహుల సంఖ్య రెట్టింపు అయింది. ఎన్ని వినతులు వస్తున్నా పథకాలను సమీక్షించి అర్హుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేయకుండా గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. తద్వారా వేలాది మంది అర్హులైన విద్యార్ధులు విదేశీ విద్యా నిధి పథకానికి దూరమై ఉన్నత విద్యను పొందలేకపోయారు.
విదేశాల్లో ఉన్నత చదువులు చాలామంది విద్యార్థుల ఆకాంక్ష. ఖర్చు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రతిభ ఉండి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధులు ఆ దిశగా ఆలోచన చేయరు. అటువంటి వారికి వరం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి వంటి పథకాలు. అటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిభ ఉండి కూడా ఉన్నత విద్యకు దూరమవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్ధులకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది. వారి జీవితాలకు గేమ్ ఛేంజర్ గా నిలిచే ఇటువంటి పథకాలను ఆదర్శంగా అమలు చేయాలనే ఉద్దేశంతో లబ్దిదారులకు మంజూరు చేసే స్కాలర్షిప్ల సంఖ్యను రెట్టింపు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా విదేశీ వర్సీటిల్లో చదివే తెలంగాణ విద్యార్ధుల సంఖ్య రెట్టింపు కానుంది. ఫలితంగా గతంలో ఈ మూడు పథకాల కింద లబ్ది పొందే విద్యార్ధుల సంఖ్య 1,110 అయితే ప్రజాప్రభుత్వ నిర్ణయంతో ఆ సంఖ్య 1,900కి చేరింది.
గతంలో మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి కింద 300 మంది బీసీ విద్యార్ధులకు మాత్రమే అవకాశం కల్పించే వారు. ఇందులో ఈబీసీల వాటా 15. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ సంఖ్యను 700కి పెంచింది. ఇందులో 500 బీసీ విద్యార్ధులకు, 200 ఈబీసీ విద్యార్ధులకు కేటాయించారు. అంటే లబ్దిపొందే బీసీ విద్యార్ధుల సంఖ్య దాదాపు 133 శాతం పెరిగింది. ఇప్పటికే బీసీ-సీ, బీసీ-ఈ వర్గాలకు చెందిన 500 మంది విద్యార్ధులు లబ్ది పొందుతున్నారు. వారు కాకుండా ఇప్పుడు బీసీలు 500 మంది లబ్ది పొందుతారు. మొత్తంగా చూస్తే సంవత్సరానికి 1000 మంది బీసీ విద్యార్ధులు లబ్ది పొందుతారు.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో 210 మంది ఎస్సీ విద్యార్ధులకు అవకాశం కల్పించే వారు. ప్రజా ప్రభుత్వం ఈ సంఖ్యను 500కి పెంచింది. అంటే లబ్దిపొందే ఎస్సీ విద్యార్ధుల సంఖ్య దాదాపు 138 శాతం పెరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో 100 మంది ఎస్టీ విద్యార్ధులకు అవకాశం కల్పించే వారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంఖ్యను 200కి పెంచింది. అంటే లబ్దిపొందే ఎస్టీ విద్యార్ధుల సంఖ్య దాదాపు 100 శాతం పెరిగింది. ఈ విధంగా ప్రజా ప్రభుత్వం రెట్టింపు సంక్షేమంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల జీవితాల్లో మార్పు కోసం చిత్తశుద్ధితో పని చేస్తోంది.
