NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు

  • ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో NIA సోదాలు
  • రామగుండంలో ఇంజనీరింగ్ విద్యార్థి అదుపులోకి
  • 54 ప్రభుత్వ వెబ్‌సైట్లే టార్గెట్‌గా కుట్ర
  • ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు సహా డిజిటల్ పరికరాలు సీజ్
Nia

Nia

NIA Raids : భారత ప్రభుత్వ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకుని విదేశీ ఉగ్ర మూకల సాయంతో సైబర్ దాడులకు పాల్పడ్డ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణను తీవ్రతరం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయాన దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా జరిగిన సైబర్ టెర్రరిజం కుట్రపై నమోదు చేసిన కేసు ఆధారంగా, దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు.. రామగుండంలో విచారణ

గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు (RC-01/2025/NIA/AMD) విచారణలో భాగంగా ఎన్ఐఏ బృందాలు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది తెలంగాణలోని కరీంనగర్/పెద్దపల్లి జిల్లా రామగుండం, మహారాష్ట్రలోని పుణె జిల్లా జున్నార్, గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్, బీహార్‌లోని గోపాల్‌గంజ్, , ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టాయి. ఈ సోదాల్లో భాగంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్యనగర్‌లో ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ నివాసంపై ఎన్ఐఏ అధికారులు సడన్ రైడ్ చేశారు. ఉగ్రవాద ముఠాలు, హ్యాకర్లతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని సమీపంలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారిస్తున్నారు.

54 ప్రభుత్వ వెబ్‌సైట్లపై దాడుల కుట్ర.. డిజిటల్ పరికరాలు స్వాధీనం

‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో దేశ భద్రతకు సంబంధించి కీలకమైన క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (CII), రక్షణ రంగ సేవలు, ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 54 అధికారిక వెబ్‌సైట్లను హ్యాక్ చేసేందుకు , డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్-ఆఫ్-సర్వీస్ (DDoS) దాడులతో స్తంభింపజేసేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించినట్లు ఎన్ఐఏ తెలిపింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడంతో పాటు సైబర్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడులకు ప్లాన్ చేశారని వెల్లడించింది. ఈ కేసును మొదట గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) నమోదు చేయగా, దీని తీవ్రత దృష్ట్యా ఎన్‌ఐఏ స్వీకరించి దర్యాప్తు చేస్తోంది.

సోదాల సందర్భంగా హ్యాకింగ్‌ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు, కీలక డాక్యుమెంట్లతో పాటు 3 ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు , ఇతర డిజిటల్ డివైస్‌లను ఎన్‌ఐఏ సీజ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయగా, వారితో సంబంధాలు నెరుపుతూ సాంకేతిక సాయం అందించిన అనుమానితుల జాబితా ఆధారంగా ఈ రైడ్స్ నిర్వహించారు. కేసులో తదుపరి విచారణ వేగంగా కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.