OTR : ఎల్లారెడ్డిలో గులాబీ టెన్షన్..! జాజుల సురేందర్ సడన్ యాక్టివిటీ వెనక అసలు కారణం ఇదేనా?

Brs

Brs

ఆ నియోజకవర్గంలో గులాబీ ఇన్ఛార్జ్‌ ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డట్టు ఎందుకు అలర్ట్‌ అయ్యారు? కారణాలు వెదుక్కుని మరీ హంగామా చేయడం, నేనున్నానని నిరూపించుకునే ప్రయత్నం చేయడానికి కారణాలేంటి? తన సీటుకు సెగలు తగులుతున్నాయా? ఎవరో వచ్చి ఎర్త్‌ పెడతారని కంగారు పడుతున్నారా? ఎవరా నాయకుడు? కంగాళీకి కారణాలేంటి? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఈ మధ్య యాక్టివిటీ పెంచారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ మధ్యనే… సమస్యల్ని వెదుక్కుని మరీ… రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. ఛాన్స్‌ దొరికేతే చాలు ఆందోళనలు, రాస్తారోకోలు అంటూ హంగామా చేసి బీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే చాలా మందికి డౌట్‌ కొడుతోందట. గచిడిన రెండున్నరేళ్లలో ఇలాంటి వైఖరి ఎప్పుడూ చూడలేదని, సడన్‌గా ఈ మార్పు ఏంటని ఆరా తీస్తున్నాయి పార్టీ వర్గాలు. మామూలుగా అయితే… అది పార్టీకి మంచిదే, ఆహ్వానించతగ్గ పరిణామమేగానీ… ఈ సడన్‌ యాక్టివిటీ వెనక ఇంకేదో మేటర్‌ ఉందని ఆరా తీసిన వాళ్ళకు కొత్త సంగతులు తెలుస్తున్నాయట. ఎల్లారెడ్డి గులాబీ పార్టీలో తమకు ప్రత్యామ్నయం లేదని ఇన్నాళ్ళు కాలర్‌ ఎగరేశారు జాజల అనుచరులు. కానీ…. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం మాత్రం వాళ్లని కంగారు పెడుతోందట. ఎల్లారెడ్డి నుంచి కారు గుర్తు మీద నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఏనుగు రవీందర్ రెడ్డి. గులాబీ బాస్‌కు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకునేవారు. కానీ… పార్టీలో జరిగిన పరిణామాలతో 2021 జూన్‌లో కారు దిగి కాషాయ జెండా కప్పుకున్నారు ఏనుగు. ఆ తర్వాత 2023 అక్టోబర్‌లో కమలం పార్టీ వీడి హస్తం పార్టీలో చేరారాయన. గత ఎన్నికల్లో బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

 

నియోజకవర్గ ఇంచార్జ్‌ హోదాలో దూకుడుగా పనిచేస్తున్న టైంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఏనుగు రవీందర్‌రెడ్డి సైలెంట్‌ అవ్వాల్సి వచ్చింది. కొన్ని రోజులు సొంత వర్గంతో కలిసి సై అంటే సై అన్నా…కాంగ్రెస్‌ పెద్దల సూచనతో కామ్‌ అవ్వాల్సి వచ్చింది. కానీ… రుద్రూరు వేదికగా మళ్ళీ గళమెత్తారు రవీందర్‌రెడ్డి. అలా సైలెన్స్‌ బ్రేక్‌ చేయడానికి కూడా ప్రత్యేక కారణం ఉందని చెప్పుకుంటున్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి త్వరలోనే గులాబీ గూటికి చేరిపోతారన్నది లేటెస్ట్‌ టాక్‌. గులాబీ పార్టీ క్యాడర్ తో పాటు ఆయన వర్గీయులు సైతం పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించడం లేదు. ఆ లెక్కన ఏనుగు సొంత గూటికి వెళితే… బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డికి తిరిగి వచ్చి పోటీ చేసే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాల కారణంగానే… ప్రస్తుతం ఎల్లారెడ్డి బీఆర్‌ఎస్‌ ఇన్ఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ అలెర్ట్ అయ్యి స్పీడ్ పెంచారన్నది కొత్త లెక్క. బాన్సువాడలో రెడ్డి సామాజిక వర్గం కాకుండా బలమైన బీసీ నేత కోసం బీఆర్‌ఎస్‌ అధిష్టానం చూస్తోందట. ఇటు కాంగ్రెస్‌లో పోచారం ఉండటం, గులాబీ పార్టీ బీసీ నేతకు ఛాన్స్‌ ఇవ్వాలని అనుకోవడంతో… ఏనుగు రవీందర్‌రెడ్డి కచ్చితంగా సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డి పైనే గురి పెడతారన్న లెక్కలున్నాయి. ఈ పరిస్థితుల్లో జాజల సురేందర్‌ యాక్టివ్‌ అవడం ఆసక్తికరంగా మారింది. ఏనుగు రవీందర్‌రెడ్డి నిజంగానే పార్టీ మారతారా? ఎల్లారెడ్డి వైపు తిరిగి వస్తారా అన్న చర్చల నడుమ ముఖ చిత్రం ఎలా మారబోతోందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.