NTV Telugu Site icon

నిజామాబాద్‌లో దొంగల బీభత్సం..

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో మరోసారి దొంగలు రెచ్చిపోతున్నారు. నిజమాబాద్‌ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దర్పల్లి ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో 10 మంది దొంగలు చొరబడ్డారు. పెట్రోల్‌ బంక్‌లోని కార్యాలయంపై రాళ్లతో దాడి చేస్తూ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. సిబ్బందిని బెదిరించి పెట్రోల్‌ బంక్‌లోని క్యాష్‌కౌంటర్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే క్యాష్‌ కౌంటర్‌లో సుమారు 40 వేలు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. దీంతో వెంటనే పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

అంతేకాకుండా పెట్రోల్‌ బంక్‌ యజమానికి కూడా ఫోన్‌ చేయడంతో పెట్రోల్‌ బంక్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై పెట్రోల్‌ బంక్‌ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పెట్రోల్‌ బంక్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. గతంలో అంతరాష్ట్ర దొంగలు సరిహద్దు ప్రాంతాల్లోని పలు ఇళ్లు, దుకాణాల్లో దొంగతనాలు చేసిన ఘటనలు ఉన్నాయి.