Site icon NTV Telugu

Vaishali Kidnap Case: గోవాలో నవీన్‌రెడ్డి అరెస్ట్.. జరిగింది తప్పే, చాలా బాధగా ఉంది..!

Naveen Reddy

Naveen Reddy

తెలంగాణ సంచలనం రేకెత్తించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు ఆదిభట్ల పోలీసులు.. గోవాలోని కాండోలిమ్ బీచ్ వద్ద నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతడిని గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇక, అతని దగ్గర ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.. ఈ నెల 9న వైశాలి ఇంటిపై నవీన్‌రెడ్డి, అతని స్నేహితులు దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి నవీన్‌ రెడ్డి పరారీలో ఉన్నాడు. అయితే, వైశాలికి అమెరికా పెళ్లి సంబంధం రావడంతో.. ఈనెల 9న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి, వైశాలిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు ‘మిస్టర్-టీ’ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు.

Read Also: Off The Record about Pinapaka BRS: కాక రేపుతోన్న గులాబీ పాలిటిక్స్‌.. ఎమ్మెల్యే వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే..

9వ తేదీన ఉదయం పదకొంటున్నర గంటలకు మూడు కార్లు, ఓ డీసీఎమ్​లో మన్నెగూడలోని సిరిటౌన్ షిప్‌లో ఉండే వైశాలి ఇంటికి చేరుకున్నాడు నవీన్‌ రెడ్డి.. పథకం ప్రకారం కిడ్నాప్ చేశాడు.. కర్రలు, రాడ్లతో విధ్వంసానికి పాల్పడ్డారు.. అక్కడ నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డిని అడ్డుకోబోయిన వైశాలి తండ్రి దామోదర్, బాబాయ్ పైనా దాడి చేశారు. ఇంట్లోకి వెళ్లి సోఫా, టిపాయి, టీవీ, ఇతర ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వైశాలిని ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. తన కారులో కూర్చోబెట్టాడు. నవీన్ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి వైశాలిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయారు. అయితే, నల్గొండ వైపు వెళ్లే మార్గంలో నవీన్ రెడ్డి, వైశాలిని కొట్టడంతో ఆమె నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. మిగతా నిందితులంతా మన్నెగూడ వైపు పారిపోయారు. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు.

ఇక, మిర్యాలగూడ దాటిన తర్వాత నవీన్ రెడ్డి స్నేహితుడు రూమెన్.. ఫోన్ ఆన్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్న విషయం తెలుసుకొని వెంటనే నవీన్ రెడ్డిని అప్రమత్తం చేశాడు. వైశాలిని ఇంటి వద్ద వదిలేద్దామని నిర్ణయించుకున్న నవీన్ రెడ్డి, అతని ఇద్దరు స్నేహితులు.. నల్గొండకు 20 కిలోమీటర్ల దూరంలో కారు దిగిపోయారు. స్నేహితుడు సహాయంతో వైశాలిని క్షేమంగా ఇంటికి పంపిన నవీన్‌రెడ్డి.. రూమెన్ మాత్రం వైశాలిని కారులో ఎక్కించుకొని మన్నెగూడ వైపు పయనమయ్యాడు. 9వ తేదీ సాయంత్రం 6.30గంటల సమయంలో రూమెన్ ఫోన్ వైశాలికి ఇచ్చి తన తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆ తర్వాత వెంటనే ఫోన్ లాగేసుకొని స్విచాఫ్ చేశాడు. మన్నెగూడకు చేరుకున్న తర్వాత మరోసారి ఫోన్ ఆన్ చేసి వైశాలికి ఇచ్చి మన్నెగూడలోని ఆర్టీవో కార్యాలయంలో ఉన్నట్లు వైశాలితో చెప్పించాడు. వెంటనే రూమెన్ తన ఫోన్ తీసుకొని స్విచాఫ్ చేసి కారులో పారారయ్యాడు. కారును శంషాబాద్ మండలం తొండుపల్లిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కేసులో మొత్తం 36మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 32మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అందులో అయిదుగురిని కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న నవీన్‌ రెడ్డిని కూడా అరెస్ట్‌ చేశారు..

అయితే, జరిగిన ఘటనపై ఓ వీడియో విడుదల చేశాడు నవీన్‌రెడ్డి.. వైశాలిరెడ్డితో తనకు ఎలా పరిచయం ఏర్పడిన విషయం కూడా చెప్పుకొచ్చాడు.. ఇక, జరిగింది తప్పేఅని ఓ వీడియోలో పేర్కొన్నాడు నవీన్‌రెడ్డి.. దాని వెనుక చాలా బాధ ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.. నా మీద చాలా ప్రచారాలు జరుగుతున్నాయి.. దాని వల్ల ఫ్యామిలీ బాధ పడుతోందని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు నవీన్‌రెడ్డి. ఆ వీడియోలో నవీన్‌రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..

Exit mobile version