ఇటీవల తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే దీనిపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 21న తెలంగాణ సర్కారు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో నెం.120 తీసుకువచ్చిందని, అయితే ఇది చిన్న నిర్మాతలను పూర్తిగా నిరాశపరిచిందని వెల్లడించారు. పెద్ద సినిమాకు, చిన్న సినిమాకు ఒకే విధంగా టికెట్ రేట్లు ఉంటే చిన్న సినిమా బతికి బట్టకట్టేదెలా అని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు లబ్ది చేకూరేలా సినిమా టికెట్ ధరలపై 10 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని నట్టి కుమార్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోలో సినిమాటోగ్రఫీ యాక్ట్ రూల్స్ లేవని చెప్పాడు. టిక్కెట్ రేట్లను కనీసం రూ.50గా నిర్ణయించాలన్నాడు. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు చేతుల్లో ఉన్నాయని, ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాళ్లిద్దరికే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల వల్ల మల్టీప్లెక్స్లో సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ పేదల పక్షపాతిగా గుర్తింపు పొందినవారేనని, అయితే సినిమా టికెట్ల అంశంలో వారు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియడం లేదని అభిప్రాయ పడ్డారు.