Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!

  • కోకాపేట్‌లో ఈగల్, రెవెన్యూ బృందాల సంయుక్త చర్య
  • సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులే ప్రధాన టార్గెట్
  • రోజుకు రూ.10-15 లక్షల గంజాయి వ్యాపారం వెలుగులోకి
  • పరారీలో నీతూ భాయ్.. ప్రత్యేక బృందాలతో గాలింపు
Drugs

Drugs

Neetu Bhai : హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్, గంజాయి ముఠాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కోకాపేట్ ప్రాంతంలో కిరాణా షాపు కేంద్రంగా భారీ ఎత్తున గంజాయి విక్రయాలు సాగిస్తున్న ‘లేడీ డాన్’ నీతూ భాయ్ (Neetu Bhai) అక్రమ సామ్రాజ్యంపై అధికారులు సర్జికల్ స్ట్రైక్ చేశారు. గంజాయి విక్రయాలకు అడ్డాగా మారిన ఆమె కిరాణా షాపును శనివారం రెవెన్యూ , ఈగల్ (EAGLE) బృందాలు సంయుక్తంగా కూల్చివేశాయి.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులే టార్గెట్

కోకాపేట్‌లో ఒక సాధారణ కిరాణా షాపును నడుపుతున్నట్లు నమ్మిస్తూ, లోపల మాత్రం నీతూ భాయ్ నల్లదందాను సాగిస్తోంది. ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటంతో ఈమె ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను (టెక్కీలను), అలాగే కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ గంజాయి విక్రయాలు జరుపుతోంది. ఈ కిరాణా షాపు మాటున ప్రతిరోజూ సుమారు 10 నుండి 15 లక్షల రూపాయల విలువైన గంజాయి వ్యాపారం జరుగుతోందని అధికారులు గుర్తించి విస్తుపోయారు. ఇప్పటికే ఈమె కుటుంబ సభ్యులను అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

×
×
Ad

అధికారులను చూసి లేడీ డాన్ ఎస్కేప్

గత వారం రోజులుగా ఈ కిరాణా షాపు దందాపై ప్రత్యేక నిఘా పెట్టిన ఈగల్ టీం, రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించింది. అయితే, అధికారుల రాకను గమనించిన లేడీ డాన్ నీతూ భాయ్ తన కొడుకుతో సహా అక్కడి నుండి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయింది. అదే సమయంలో అక్కడ గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన సుమారు 67 మందిని ఈగల్ టీం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

మొత్తం ఆస్తుల కూల్చివేతకు సిఫార్సు

నేరాలకు అడ్డగా మారిన సదరు కిరాణా షాపును తక్షణమే కూల్చివేయాలంటూ ఈగల్ బృందం రెవెన్యూ శాఖకు సిఫార్సు చేయడంతో అధికారులు దానిని నేలమట్టం చేశారు. అంతటితో ఆగకుండా, త్వరలోనే నీతూ భాయ్‌కి సంబంధించిన అన్ని అక్రమ ఆస్తులను కూడా పూర్తిగా కూల్చివేస్తామని ఈగల్ టీం హెచ్చరించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న లేడీ డ్రగ్ డాన్ నీతూ భాయ్ , ఆమె కుమారుడి కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.