NTV Telugu Site icon

Nagam Janardhan Reddy: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. నాగం జనార్ధన్ డిమాండ్

Nagam Janardhan Reddy

Nagam Janardhan Reddy

Nagam Janardhan Reddy Demands Sorry From CM KCR: నాగర్ కర్నూల్ సభలో సీఎం కేసీఆర్ మోసపూరిత ప్రకటనలు చేశారని.. అందుకు ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2017లో వచ్చిన పహాని ఆధారంగా ధరణి పోర్టల్‌ని తయారు చేశారని.. ఆ పోర్టల్ అంతా తప్పులు తడకగానే ఉందని మండిపడ్డారు. ఆఫీసర్లకు తమకు ఇష్టం వచ్చిన వారి పేర్లు నమోదు చేసుకునే విధంగా ఆ పోర్టల్ ఉందని పేర్కొన్నారు. ఈ ధరణి పోర్టల్‌కు తాను కూడా బాధితుడ్నేనని, తన భూమి కూడా పోయిందని చెప్పారు. ధరణి మొత్తం దరిద్రంగా ఉందని ఫైరయ్యారు. మిషన్ కాకతీయ ద్వారా ప్రజలకు ఒక ఎకరా భూమి కూడా పెరిగింది లేదన్నారు. సీఎం కేసీఆర్ ఉపన్యాసాలకు పనికొస్తాడు తప్ప.. ప్రజలకు పనిచేసేందుకు పనికిరాడని విరుచుకుపడ్డారు.

MLA Seethakka: ములుగును టార్గెట్ చేస్తున్నారు.. కేటీఆర్ పర్యటనపై ఎమ్మెల్యే సీతక్క కామెంట్స్

ధనిక రాష్ట్రంగా ఉండే తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని నాగం జనార్దన్ ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన కుంభకోణాల్లో మరో భారీ కుంభకోణం వెలుగు చూస్తుందని కుండబద్దలు కొట్టారు. ప్రాజెక్టులు, భూ కుంభకోణాలతో పాటు.. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాల్లో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఒక్కో భవనం 125 వేల చదరపు అడుగుల స్థలంలో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి రూ. 53 కోట్ల నుంచి 62 కోట్లకు పెంచి వెచ్చించారని, ఈ లెక్కన ఒక స్క్వేర్ ఫీట్ ధర రూ.4,240 అవుతుందని వివరించారు. మార్కెట్లో అత్యధిక హంగులు, కార్పొరేట్ స్థాయిలో నిర్మించే భవనాలకు సైతం ఒక స్క్వేర్ ఫీట్ రూ.1800 మించి కావడం లేదని.. ఈ లెక్కన మొత్తంగా వాటిని నిర్మాణానికి రూ.30 కోట్లు అవుతుందని తెలిపారు. మరి.. కలెక్టరేట్ భవనాలకు రూ.60 కోట్ల ఖర్చు ఎలా అవుతోందని ప్రశ్నించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నిర్మించే భవనాల్లో భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

Errabelli Dayakar Rao: కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి చేయరు.. చేసేవాళ్లను నిందిస్తారు

నాగర్ కర్నూల్ సభలో కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని నాగం జనార్దన్ ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో.. సుప్రీంకోర్టు 7.17 టీఎంసీలు మాత్రమే డ్రా చేయాలని చెబుతుందని, అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఉద్దండపూర్ వరకు ఐదు ప్యాకేజీలలో నీటిని నింపుతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని.. పాలమూరు ప్రాజెక్టు ఆపమన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకుడేనని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తాను పని చేస్తున్నప్పుడు.. సిపిడబ్ల్యూ స్కీం ద్వారా సిద్ధిపేటకు నీళ్లు ఇచ్చింది తానేనని గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చిన ఘనత తనకే దక్కుతుందని అన్నారు.