మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3వ తేదీన జరిగింది.. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిస్తే.. అప్పటికీ భారీ క్యూలైన్లు ఉండడంతో.. రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది.. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు చివరి రెండు, మూడు గంటల్లో జరిగిన పోలింగ్ ప్రధాని పార్టీ అభ్యర్థుల్లో కొన్ని ఆశలతో పాటు.. పెద్ద టెన్షన్ పెడుతున్నాయి… అయితే, గెలుపుపై ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.. లోపల వారికి క్లారిటీ ఉన్నా.. బయటకి మాత్రం గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6 గంటల వరకే తీసుకున్నారని.. కానీ, రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది.. దీంతో.. మాదే గెలుపు అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది… మొదట పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైన కౌంటింగ్ కొనసాగుతోంది… ఉదయం 9 గంటలకే తొలి ఫలితం వెలవవనుంది… మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మునుగోడు ఎన్నికలో 686 బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా.. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్లను మొత్తం 15 రౌండ్లలో లెక్కించనున్నారు..
Read Also: Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఫలితాలు లైవ్ అప్డేట్స్..
ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు.. చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1 గంటలోగా ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు.. ముందుగా చౌటుప్పల్, తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్ మండలాల ఓట్లు లెక్కింపు జరగనుంది… ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు.. ఇక, ఎలాంటి పరిస్థితులు ఎదరైనా అదుపుచేయడానికి అనుగుణంగా.. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.. ప్రతి పార్టీ నుంచి 21 మంది ఏజెంట్లను నియమించారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిదే విజయం అని తేల్చేశాయి… ప్రీపోల్స్ సర్వేలతో పాటు.. ఎగ్జిట్ పోల్స్లోనూ గులాబీ పార్టీదే విజయమని.. కారు దూసుకుపోతుందని తేల్చాయి.. దీంతో, గెలుపుపై కూసుకుంట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు..
ఇక, గత ఎన్నికల్లో నేను ఓటమి పాలయ్యా.. ఉప ఎన్నికలో మాత్రం నాదే విజయం అంటున్నారు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి.. కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయంటున్నారు.. మునుగోడు గడ్డపై ఎగరబోయేది గులాబీ జెండేనంటూ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ప్రీపోల్ సర్వేలతో పాటు.. ఎగ్జిట్ పోల్స్ కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని.. మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయంటున్నారు. మరోవైపు.. ఈ ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు.. ప్రీపోల్స్ సర్వేలు ఎలా ఉన్నాయి.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా వచ్చినా… గెలుపు మాత్రం తనదే అంటున్నారు.. ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం వరకే తీసుకున్నారు.. రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరిగింది.. ఆ ఓటింగ్ తనకే అనుకూలంగా ఉంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో విజయం తనదేనని.. మళ్లీ మునుగోడు ఎమ్మెల్యేను నేనే అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… అంతేకాదు.. తన మెజార్టీని కూడా ఆయన చెప్పుకొచ్చారు.. కనీసం ఐదువేల ఓట్ల మెజార్టీతే విజయం నాదే అంటున్నారు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు స్పష్టంగా కనిపించింది.. అదే తన గెలుపునకు బాటలు వేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు..
ఇక, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో జెండా ఎగరవేసి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలన్న ఉత్సాహంతో.. పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపింది కాంగ్రెస్.. ఆమె కూడా గట్టిగానే ప్రచారం చేశారు.. సర్వశక్తులు ఒడ్డారు.. అంతేకాదు.. విజయం నాదే అనే ధీమాతో ఉన్నారు పాల్వాయి స్రవంతి.. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బరిలోకి దిగారు.. ప్రచారంలో అందరినీ ఆకట్టుకున్నారు.. ఇక, పోలింగ్ రోజు నవ్వులు పూయించారు.. ఆయన అయితే.. ఏకంగా 50 వేల మెజార్టీతో గెలుస్తానని అంటున్నారు.. బీఎస్పీ అభ్యర్థి కూడా మంచి ఓట్లు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.. మరి ప్రీపోల్స్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి.. అసలైన ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి..