Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!

  • ములుగు కలిపాక గ్రామంలో వర్షాకాల కష్టాలు
  • జిన్నెల వాగు దాటేందుకు మానవ హారంగా గ్రామస్థులు
  • ఆసుపత్రి, నిత్యావసరాల కోసం ప్రాణాలకు తెగింపు
  • బోటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Mulugu

Mulugu

Mulugu : వర్షాకాలం వచ్చిందంటే చాలు ములుగు జిల్లాలోని అటవీ గ్రామాలకు కష్టాలు మొదలవుతాయి. ముఖ్యంగా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ‘కలిపాక’ ఆదివాసీ గ్రామ ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోంది. నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలన్నా, అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిన దుస్థితి నెలకొంది. చుట్టూ అడవి, మరోవైపు ఉధృతంగా ప్రవహించే వాగుల మధ్య ఈ గ్రామం వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఒక ద్వీపంగా మారుతోంది.

జిన్నెల వాగు ఉధృతి.. గొలుసుకట్టుగా దాటుతున్న వైనం

కలిపాక గ్రామ సరిహద్దుల్లో ప్రవహించే ‘జిన్నెల వాగు’ ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ, పొట్టకూటి కోసం , నిత్యవసరాల కోసం మహిళలు, గ్రామస్థులు దాటక తప్పడం లేదు. తాజాగా సుమారు 15 మంది గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటూ మానవ హారంగా (గొలుసుకట్టుగా) మారి ప్రాణాలకు తెగించి ఈ వాగును దాటారు. ఒక్క అడుగు తప్పటడుగు పడినా వరద ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, వేరే మార్గం లేక ప్రతిరోజూ ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోటు ఏర్పాటు చేయాలని గ్రామస్థుల విజ్ఞప్తి

వర్షాకాలం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నామని ఆదివాసీ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి కనీసం ఈ వర్షాకాలం సీజన్ ముగిసేవరకైనా ప్రయాణానికి ఒక బోటు (పడవ) అందుబాటులో ఉంచాలని వేడుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ బోటు ఎంతగానో ఉపయోగపడుతుందని, తమ కష్టాలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలిపాక గ్రామస్థులు కోరుతున్నారు.