MP Joginapally Santosh Kumar Started Second Edition Of Green Challenge: తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్లో జమ్మి మొక్కలు నాటి, రెండో విడతను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ కార్పోరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి హాజరయ్యారు. దసరా పండగ సందర్భంగా అన్ని గ్రామాలు, గుడుల్లో కలిపి.. లక్షా ఇరవై వేల జమ్మి మొక్కలను నాటేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో కలిసి అటవీ, దేవాదాయ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు.
వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లును.. తెలంగాణ రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం గుర్తించింది. అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో ఉండేలా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని తీసుకున్నామని సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అటవీ, దేవాదాయ శాఖలకు ఆయన కృతజ్జతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమాన్ని తాము ఆహ్వానిస్తున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుడుల్లో జమ్మి చెట్టు నాటి, వాటిని పెంచేలా దేవాదాయ శాఖ ద్వారా చొరవ తీసుకుంటున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఇదే సమయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. యువ ఎంపీగా ఉన్న సంతోష్ కుమార్ పర్యావరణంతో పాటు సంస్కృతికి ప్రాధాన్యతను ఇవ్వటం సంతోషకరం అన్నారు. అటు.. ఫారెస్ట్ కార్పోరేషన్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి కార్యక్రమాన్ని విసృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వేదకాలం నుంచీ నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో, గుడిలో, బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన ఎంపీ సంతోష్ కుమార్కు అభినందనలు తెలిపారు.
బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
ఐటీ కారిడార్తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలకు ఆక్సిజన్ హబ్గా, రోజువారీ వాకింగ్తో పాటు వారాంతాల్లో కుటుంబాలకు సేదతీరే ప్రాంతంగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ విశేషంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 270 ఎకరాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం, అటవీశాఖ చొరవతో ప్రకృతివనంగా మారింది. ఇవాళ సమావేశం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ తమ గౌరవ అధ్యక్షుడిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అద్భుతంగా తీర్చిదిద్దిన బొటానికల్ గార్డెన్స్ విశిష్టతను కాపాడేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇచ్చారు. కాగా.. వజ్రోత్సవ వేడుకల సదర్భంగా ఏర్పాటు చేసిన రన్ ఫర్ పీస్ కార్యక్రమం పోస్టర్, టీషర్ట్స్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.