బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రమ ఫలించింది. తన పార్లమెంట్ పరిధిలోని రోడ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ బండి సంజయ్ చేసిన విజ్ఝప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 2021-22 సంవత్సరానికిగాను తెలంగాణకు రూ. 878.55 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఆ శాఖ జాతీయ కార్యదర్శి కమల్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మంజూరైన మొత్తం నిధుల్లో దాదాపు రూ.204 కోట్లు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రహదారుల నిర్మాణానికి కేటాయించడం విశేషం. వాస్తవానికి కేంద్రం నుండి రాష్ట్రానికి వివిధ శాఖల ద్వారా నిధులు రాబట్టేందుకు బండి సంజయ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. సీఐఆర్ఎఫ్ కింద రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు.
కేంద్రం తన విజ్ఝప్తికి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడంపట్ల బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులకు బండి సంజయ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు రహదారుల నిర్మాణానికి ఆయా నిధుల్లోనుండి దాదాపు రూ.204 కోట్లు కేటాయించినట్లు బండి సంజయ్ ఈ సందర్భంగా తెలిపారు. నిధులు మంజూరు కావడంతో ఆయా పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. నిర్ణీత గడువులోగా రహదారుల నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
