కరీంనగర్లో కరోనా కలకలం కొనసాగుతుంది. బొమ్మకల్లోని చల్మెడ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు, స్టాఫ్కు మొత్తం 49 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాలేజీలో మొత్తం 1000 మంది ఉండగా, మరో 100 మంది విద్యార్థుల శాంపిల్స్ను టెస్టులకు వైద్య సిబ్బంది పంపించారు. 49 మందికి పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కళాశాల యాజమాన్యం ఆందోళనలో ఉంది. దీంతో కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.
కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వెంటనే వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి, కరోనా వ్యాపించకుండా చర్యలు చేపట్టింది. ప్రైమరీ కాంటాక్ట్లుగా ఉన్న వారికి సైతం కరోనా నిర్ధారణ పరీక్షలను వైద్యశాఖ చేస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి జువేరియా చల్మెడ మెడికల్ కాలేజీని సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను యాజమాన్యానికి వైద్యాధికారులకు సూచించారు. జిల్లా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని జువేరియా తెలిపారు.