Montha Effect : మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా వరద నీరు భారీగా చేరింది. ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.
వరంగల్ నగరంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్ఎన్ నగర్, లక్ష్మీగణపతి కాలనీ, విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్ రోడ్, బట్టలబజార్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు కష్టంగా మారాయి. ముఖ్యంగా శివనగర్ ప్రాంతంలో రహదారిపై నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ బస్టాండ్ పరిసరాలు చెరువును తలపించే స్థితికి చేరాయి.
భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ప్రజలు 79819 75495 నంబర్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. వరంగల్ జిల్లాలోని కల్లెడ్ ప్రాంతంలో అత్యధికంగా 34 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదనంగా, ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ప్రకటించబడ్డాయి.
ఖమ్మం–మహబూబాబాద్ జిల్లాల మధ్య ఉన్న వాల్యాతండా సమీప వంతెన వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద తీవ్రత పెరగడంతో అధికారులు రెండు జిల్లాల మధ్య రాకపోకలను సాయంత్రం నుంచి నిలిపివేశారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
