దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమంతో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం తో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అలా చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని కవిత పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలని కవిత బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఆహార భద్రత ముఖ్యమని, భవిష్యత్తులో ఏదైనా సంక్షోభంతో ఆహార కొరత ఏర్పడితే ప్రపంచంలోని ఏ దేశమూ సాయం అందించలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆహార భద్రత కోసమే ఏర్పడిన ఎఫ్ సీఐకి ఎలాంటి వార్షిక క్యాలెండర్ లేకపోగా, ధాన్యం సేకరణకు సరైన విధానం సైతం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎఫ్సీఐ వివిధ రాష్ట్రాల నుండి ఒక పద్దతి లేకుండా ధాన్యాలను కొంటోందన్న ఎమ్మెల్సీ కవిత, ప్రతి ఏడాది ఎఫ్ సీఐ పంట కొనుగోలుకు సంబంధించిన వార్షిక క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వార్షిక క్యాలెండర్ ప్రకారం ప్రతి రాష్ట్రం ఏ పంట పండించాలి అనే విషయంపై అక్కడి రైతులకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ట్రం, కులం, మతంతో సంబంధం లేకుండా, ఎక్కడ ఉన్నా రైతు రైతేనన్న ఎమ్మెల్సీ కవిత, కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదన్నారు.
సాగులో అద్భుతమైన ప్రగతి
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నేపథ్యం భిన్నమైనదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఒకప్పుడు నీటి కొరత ఉన్న తెలంగాణలో, గత 8 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ గారి విధానాలతో అద్భుతమైన సాగునీటి వసతులు ఏర్పాటు చేయడంతో పాటు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. రైతుల నుండి నీటి పన్ను వసూలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న ఎమ్మెల్సీ కవిత, రైతు బంధు పథకంతో ఎకరానికి ప్రతి ఏడాది రూ. పదివేల పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో తెలంగాణలో వరి ధాన్యం దిగుబడి రెట్టింపు అయిందని, దీంతో ధాన్యం వినియోగం అనంతరం అనేక మిగులు ధాన్యం తెలంగాణలో ఉంటోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దీంతో ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరామని, ధాన్యం కొనుగోలుపై గతంలో హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్రంలోని 61 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పంజాబ్ లో కొంటున్న విధంగానే తెలంగాణ లోనూ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత, బాయిల్డ్ రైస్, ముడి బియ్యం అంటూ కండిషన్ లు పెట్టకూడదన్నారు.
తెలంగాణ రైతులు ధాన్యం కొనుగోలుకై జాతీయ రహదారులపై చేస్తున్న నిరసనలతో ఇబ్బంది పడ్డ ఇతర రాష్ట్రాల ప్రజలు ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ఢిల్లీ వీదుల్లో ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకురావద్దని బీజేపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూచించారు.
