Extra Marital Affair : హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగుచూసింది. పరాయి పురుషుడితో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో ఒక భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ.. తన భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు అప్పట్లో మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించారు.
అయితే పోలీసుల లోతైన దర్యాప్తులో భాగంగా సదరు మహిళ కాల్ డేటా రికార్డులను (CDR) , ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా అసలు నిజం బయటపడింది. భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందని, అనంతరం ఆధారాలు దొరక్కుండా శవాన్ని వాహనంలో మహారాష్ట్ర సరిహద్దుల (బార్డర్) వరకు తరలించి అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘాతుకానికి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తాజాగా మహారాష్ట్రలోని స్థానిక పోలీసుల సహాయంతో నిందితుడు చూపించిన ప్రాంతంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

