NTV Telugu Site icon

టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల ముందు కాంగ్రెస్ కుట్రలు ఓడిపోయాయి: జగదీశ్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల ముందు కాంగ్రెస్ కుట్రలు ఓడిపోయాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించడంతో నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కోటిరెడ్డికి పార్టీలకతీతంగా మద్దతు తెలిపి మెజార్టీ ఇచ్చి గెలిపించారన్నారు.

తక్కువ ఓట్లు ఉన్న జిల్లాలో పోటీ చేసిన కాంగ్రెస్ నల్గొండ జిల్లాలో కుట్రపూరితంగా పని చేసిందని మంత్రి ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా అవేమి ఫలించలేదన్నారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించాలని పరోక్షంగా కాంగ్రెస్‌కు మంత్రి చురకలు అంటించారు. ఈ గెలుపుతో పార్టీని మరింత బలోపేతం చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 12కు పన్నెండు స్థానాలు గెలుచుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.