ఆశ వర్కర్లకు పనిలో సిన్సియారీటి ఉండాలి..లేకుంటే ఏరిపారేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో నూతనంగా నిర్మించిన మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం దళిత బంధు లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మెదక్ లో మాత శిశు ఆరోగ్య కేంద్రం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజ్ కు సంబందించిన ఉత్తర్వులు అందజేస్తామని వరాలజల్లు కురిపించారు. వైద్య రంగానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మెదక్ లో 100 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాం..దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని రకాల హంగులతో హాస్పిటల్ ను ఏర్పాటు చేశామని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ హాస్పిటల్స్ లో కాన్పుల సంఖ్య పెరగాలని, అధికారుల నిర్లక్ష్యంతో కాన్పుల డాటా చెప్పలేక పోతున్నామని హరీశ్ రావ్ అన్నారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ హాస్పిటల్స్ లో 30 శాతం ఉంటే.. ఇప్పుడు 56 శాతానికి పెరిగింది.. దీనిని మరింతగా పెంచుతామని పేర్కొన్నారు. ఆశావర్కర్లు గర్భిణిలను ప్రభుత్వ హాస్పిటల్స్ కు తీసుకురావాలని కోరారు. నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలని ఆదేశించారు. పేదలు ప్రయివేటు హాస్పిటల్స్ కి వెళ్లి అప్పులపాలు కావద్దని సూచించారు.
తెలంగాణ లో 36 శాతం మాత్రమే మొదటి గంట తల్లి పాలు తాగుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అంగన్ వాడీల ద్వారా ఆరోగ్య లక్ష్మీ కింద పౌష్టికాహారం ఇస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు ఆశ వర్కర్లకు 15 వందల జీతం ఉంటే.. ఇప్పుడు రూ 9500 జీతం ఇస్తున్నారు..ఇంకా పెంచుకుందామని శుభవార్త చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షకులు ఆశావర్కర్లు అంటూ ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ లో నార్మల్ డెలివరీ లు చేస్తే పారితోషకం ఇస్తామని హరీశ్ రావ్ అన్నారు. ఆశ వర్కర్లకు పనిలో సిన్సియారీటి ఉండాలి..లేకుంటే ఏరిపారేస్తామని అన్నారు. కరోనా సందర్భంగా వైద్యులు,సిబ్బంది, ఆశావర్కర్లు ఎంతో కష్ట పడ్డారని గుర్తు చేసుకున్నారు. వైద్య పరీక్షలు, స్కానింగ్ సౌకర్యం ప్రభుత్వ హాస్పిటల్స్ లో జరగాలి..ప్రయివేట్ హాస్పిటల్స్ కు పంపొద్దని, ప్రభుత్వ ఆరోగ్య సేవలను బలోపేతం కోసం సమిష్టిగా పనిచేద్దామని అన్నారు.
అమ్మఒడి వాహనాలను వాడాలి.. మనమందరం ప్రజల సేవకులమని హరీశ్ రావ్ తెలిపారు. దళిత బంధు అనేది పథకం కాదు..ఒక ఉద్యమం అన్నారు. దళిత సంరక్షణ నిధిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 16 శాతం దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లాలో 256 మందికి గ్రౌండింగ్ చేస్తున్నామని ఈ సందర్భంగా హరీశ్ రావ్ అన్నారు.
Talasani Srinivas Yadav: అమ్మవారిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయటం దుర్మార్గం