ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలు ఉండగా, ప్రధానంగా ఆరు కీలక పట్టణాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు ముమ్మరంగా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులను కాపాడుకునేందుకు , ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే రహస్య ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఇంద్రేశం వంటి చోట్ల స్వతంత్రులు బీఆర్ఎస్లో చేరడంతో కొన్ని పీఠాలు ఖరారైనప్పటికీ, మిగిలిన చోట్ల మాత్రం రేపు జరగబోయే ఎన్నిక వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది.
ఈ రాజకీయ చదరంగంలో బీజేపీ ఊహించని విధంగా ‘కింగ్ మేకర్’గా అవతరించింది. ముఖ్యంగా నర్సాపూర్ , జిన్నారం మున్సిపాలిటీల్లో బీజేపీ మద్దతు లేనిదే ఏ పార్టీ కూడా పీఠాన్ని దక్కించుకోలేని పరిస్థితి ఉంది. నర్సాపూర్లో కాంగ్రెస్కు ఆరు, బీఆర్ఎస్కు ఐదు, బీజేపీకి నాలుగు సీట్లు రాగా, బీజేపీ తమకు చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తామనే గట్టి ఆఫర్ను రెండు ప్రధాన పార్టీల ముందు ఉంచింది. జిన్నారంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో, ఇక్కడ చైర్మన్ పీఠం దక్కాలంటే బీజేపీ కౌన్సిలర్ల మద్దతు తీసుకోవడం కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలకు తప్పనిసరిగా మారింది. దీంతో కమలం పార్టీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారి రెండు పార్టీలకు షాక్ ఇస్తోంది.
మరోవైపు జహీరాబాద్ , ఇస్నాపూర్లో రసవత్తర పోరు సాగుతోంది. జహీరాబాద్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలిచాయి, అయితే అక్కడ గెలిచిన ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ రెబెల్స్ కావడంతో వారిని తిరిగి బుజ్జగించే పనిలో హస్తం పార్టీ ఉంది. ఇస్నాపూర్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి, ఇక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మద్దతు ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. జిన్నారంలో బీజేపీకి చైర్మన్ పదవి ఆఫర్ చేస్తే, ఇక్కడ వారు ఏ పార్టీకి ఓటు వేస్తారనేది మిస్టరీగా మారింది. ఇప్పటికే సంగారెడ్డి, సదాశివపేట వంటి చోట్ల కాంగ్రెస్ పట్టు సాధించగా, సిద్దిపేట పరిసరాల్లో బీఆర్ఎస్ తన పీఠాలను కాపాడుకుంది. రేపు (ఫిబ్రవరి 16న) జరగనున్న చైర్మన్ ఎన్నికలతో ఈ అనిశ్చితికి తెరపడనుంది.
Deputy CM Pawan: పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు పని చేయాలి..
