Site icon NTV Telugu

Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి

Fire Accident

Fire Accident

చేతికి వచ్చిన పంట కళ్లముందే బూడిద కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఘోర అగ్నిప్రమాదంలో సుమారు 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పొలాల మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు రేగాయి. ఎండతీవ్రతకు తోడు గాలి ఉధృతి తోడవడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి సుమారు 2 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. మంటలు వేగంగా గ్రామ సమీపానికి చేరుకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలు ఊరిపైకి వస్తుండటంతో రైతులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చేలోపే, రైతులు తమ ట్రాక్టర్లతో పంట చేన్లను దున్ని మంటలు పక్కకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. తమ కష్టాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడారు. అనంతరం సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా అగ్గిపాలవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

 

Exit mobile version