NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao: బీజేపీతోనే దేశానికి ప్రమాదం.. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి

Kunamneni On Bjp

Kunamneni On Bjp

Kunamneni Sambasiva Rao Fires On BJP And Narendra Modi: దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఆర్థిక స్వాలంబనకు ఢోకా ఏర్పడిందని.. ప్రస్తుతం రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని.. దీనికంతటికీ కేంద్ర ప్రభుత్వ విధివిధానాలే కారణమని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గురువారం షాద్‌నగర్‌లోని కేకేఆర్ కన్వెన్షన్లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, మనువాదాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు విఘాతం కల్పిస్తున్నారని.. దేశంలో బీజేపీ విస్తరిస్తే ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆస్నమైందని పిలుపునిచ్చారు.

Acid Attack : టీ ఇవ్వలేదని భార్యపై యాసిడ్ పోసిన భర్త

గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపామన్న సాంబశివరావు.. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ లాంటి పార్టీలు బలపడాలని కోరుకుంటున్నామని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాంటి వారిపై చట్టం తన పని తాను చేయకుండా.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి కానీ.. దర్యాప్తు సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టడం మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరించి లొంగదీసుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు 58 మంది, అదేవిధంగా 170 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని.. ఇవి కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. ఎంతోమంది ఆర్థికంగా 150 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడితే.. కేంద్రం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని విరుచుకుపడ్డారు.

K Laxman: యువత బతుకుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆగం చేసింది

అవినీతి చేసిన వారు బీజేపీలో ఉంటే పునీతులు అవుతారని, లేకపోతే పాపాత్ములు అవుతారనే చందంగా బీజేపీ వ్యవహరిస్తుందని కూనంనేని ఎద్దేవా చేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో అన్యాయంగా ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టిందని అన్నారు. భవిష్యత్తులో కేంద్రం పెద్దలు అనుభవించాల్సి ఉంటుందని, మోడీ కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వార్నింగ్ ఇచ్చారు. తొమ్మిదేళ్లలో గాలి జనార్ధన్ రెడ్డి, యడ్యూరప్ప లాంటివారు ఎందరో ఆర్థిక సంపదలు కొల్లగొట్టారని.. వీరిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్, అరవింద్ ఓడిపోతారని.. ఒక్క లోక్‌సభ స్థానం కూడా బీజేపీకి దక్కదని జోస్యం చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఉంటుందని స్పష్టం చేసిన ఆయన.. అనేక స్థానాల్లో సీపీఐ ఉమ్మడిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడతామని, బీజేపీని ఎదురిస్తామని చెప్పుకొచ్చారు.