KTR : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేగంగా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం షేక్పేట్లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందని చెప్పారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది మా ప్రియమైన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఎన్నిక. మాగంటి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఎంతో సేవ చేసింది. అందుకే వారి భార్య మాగంటి సునీతమ్మకు టికెట్ ఇచ్చాం. మా పార్టీ ఎప్పుడూ తమ నాయకుల కుటుంబాలను గౌరవంగా చూసుకుంటుంది అని అన్నారు.
“సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఎందుకంటే నగర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. మా పాలనలో ఐటీ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందింది, దేశ నలుమూలల నుంచి ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్కి వస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా ఆ అవకాశాన్ని వదిలిపెట్టకుండా అనేక నిర్మాణ పనులు, ఫ్లైఓవర్లు, మెట్రో ప్రాజెక్టులు చేపట్టాం. ఇప్పటివరకు 42 ఫ్లైఓవర్లు, 70 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం పూర్తి చేశాం” అని వివరించారు.
“వ్యవసాయ రంగంలో తెలంగాణ ఇప్పుడు పంజాబ్, హర్యానాలకు సాటి అవుతోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో ఇది సాధ్యమైంది. ఒకప్పుడు నగరంలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు తప్పనిసరిగా కనిపించేవి, కానీ ఇప్పుడు కరెంట్ కోతలు, నీటి కొరత లేని స్థాయికి అభివృద్ధి చేసాం. హరితహారంతో రాష్ట్రాన్ని గ్రీన్ ఎకానమీగా మార్చాం” అని కేటీఆర్ తెలిపారు.
“హైదరాబాద్లో విద్యావంతులు ఎక్కువగా ఉన్నా, ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఇది బాధాకరం. మీరు ఓటు వేయడానికి రాకపోతే రిగ్గింగ్కి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలి,” అని కేటీఆర్ అన్నారు. “అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. సంక్షేమ పథకాలతో ప్రతి వర్గం లబ్ధి పొందింది. గంగా–జమున తహసీబ్ సంస్కృతిని కాపాడాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రామీణ ప్రజలను మోసం చేసింది. అయినా కేవలం ఒకటిన్నర శాతం తేడాతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది,” అని ఆయన తెలిపారు.
