Site icon NTV Telugu

KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

Kavitha Ktr

Kavitha Ktr

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి కొత్త మలుపునిస్తూ అధికారికంగా భారత్ రాష్ట్ర సమితి (BRS)లో చేరారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి స్వయంగా విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్, జీవన్ రెడ్డిల మధ్య ఉన్న నాలుగు దశాబ్దాల స్నేహబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 2014లోనే జీవన్ రెడ్డిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ, అప్పట్లో ఆయన కాంగ్రెస్ పట్ల తనకున్న నిబద్ధతను చాటుతూ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారని, కానీ నేటి పరిస్థితులు ఆయనను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తూ జీవన్ రెడ్డి వంటి సీనియర్లను అవమానపరుస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

రుణమాఫీ పేరుతో రైతులను వంచించారని, అహంకారపూరిత వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించిన కేటీఆర్, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జీవన్ రెడ్డి వంటి అనుభవం ఉన్న నాయకుల సహకారం పార్టీకి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు. తాను ఎన్టీఆర్, చెన్నారెడ్డి, వైఎస్సార్ వంటి దిగ్గజ ముఖ్యమంత్రుల పాలనను చూశానని, అయితే వారందరికంటే కేసీఆర్ పాలనే అత్యంత మెరుగ్గా సాగిందని కొనియాడారు. పదేళ్ల కేసీఆర్ ప్రగతిశీల పాలన తర్వాత, రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రం రెండేళ్లలోనే తిరోగమనంలోకి వెళ్లిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ విమర్శలే కాకుండా, వ్యక్తిగత మానసిక క్షోభ , రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.

Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

తన రాజకీయ ప్రస్థానం చివరి దశలో ఉందని, బహుశా మరో ఎన్నికను చూసే అవకాశం తనకు ఉండవచ్చని చెబుతూ, ఈ చివరి అంకంలో పాత మిత్రుడైన కేసీఆర్ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం రుణమాఫీలో విఫలమైందని, రైతుల ఆక్రోశం రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటుతోందని ఆయన విమర్శించారు. పౌర సమాజంలో గౌరవం ఉన్న నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీరు వల్ల సీనియర్లకు గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

వచ్చే రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వెళ్లి కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు జీవన్ రెడ్డి తెలిపారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం , తగిన గౌరవం కల్పిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ జెండా మోసిన జీవన్ రెడ్డి వంటి మేధావి, నిబద్ధత గల నాయకుడు బీఆర్ఎస్ గూటికి చేరడం కరీంనగర్ జిల్లాలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చేరికతో కాంగ్రెస్ కోటలో ఒక పెద్ద వికెట్ పడినట్లయిందని, రాబోయే రోజుల్లో ఇది మరిన్ని రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందని స్పష్టమవుతోంది.

Exit mobile version