Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. తనను రాజకీయంగా, పరిపాలనాపరంగా అణచివేస్తున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సంచలన లేఖ రాశారు. ఈ లేఖతో పాటు తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు ఉన్న ఒక పెన్డ్రైవ్ను కూడా ఆయనకు జత చేసి పంపడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
పరిపాలనలో పక్కనపెడుతున్నారు.. శాఖాపరమైన నిర్ణయాల్లో అలక్ష్యం
మంత్రిగా ఉన్నప్పటికీ తన నిర్ణయాధికారాన్ని క్రమంగా తగ్గిస్తున్నారని కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి సమాచారం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచే తన శాఖాపరమైన నిర్ణయాలు జరిగిపోతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా దేవాదాయ శాఖలోని కీలక నిర్ణయాల్లో తనను పూర్తిగా పక్కన పెడుతున్నారని తెలిపారు. యాదాద్రి టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయంలో కనీస సమాచారం కూడా ఇవ్వలేదని, అలాగే సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి నిధులను తనను సంప్రదించకుండానే ఆర్అండ్బీ (R&B) శాఖకు బదిలీ చేశారని లేఖలో పేర్కొన్నారు. చివరకు శ్రీరామనవమి ప్రభుత్వ అధికారిక ప్రకటనల్లో తన ఫోటోను కూడా తొలగించారని వాపోయారు.
వరంగల్ జిల్లా అభివృద్ధికి గండి.. కడియం శ్రీహరిపై ఫిర్యాదు
తన సొంత నియోజకవర్గమైన వరంగల్ తూర్పు అభివృద్ధి పనులకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని సురేఖ ఆరోపించారు. స్మార్ట్ సిటీ మోడల్ బస్ స్టాండ్, బొందివాగు విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రిగా ఉన్న తనకు చెప్పకుండానే దేవాదాయ శాఖ అధికారులతో నేరుగా సమీక్షలు నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వానికి ముందే తెలియజేసినప్పటికీ కడియం శ్రీహరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పార్టీలో అందరికీ సమాన నిబంధనలు అమలు కావడం లేదని ప్రశ్నించారు.
బీసీ మహిళా మంత్రిగా టార్గెట్ చేస్తున్నారు: కొండా సురేఖ ఆగ్రహం
తాను ఒక బీసీ మహిళా మంత్రిని కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారనే భావన కలుగుతోందని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరి చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తన కుటుంబంపై పక్కా ప్రణాళికతో రాజకీయ దాడులు జరుగుతున్నాయని, తన మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్పై తీసుకున్న చర్యలు కూడా అందులో భాగమేనని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాలపై నిష్పక్షపాతంగా, సమగ్ర విచారణ జరిపించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు.

