వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో సంచలన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ మొదటిసారిగా తమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై దృష్టి సారించిన కొండా దంపతుల ఈ భేటీ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.
వర్షం కారణంగా హోటల్కు మారిన సమావేశ వేదిక
తొలుత హనుమకొండ రాంనగర్లోని కొండా సురేఖ నివాసంలోనే ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే, వరంగల్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కార్యకర్తల సౌకర్యార్థం సమావేశ వేదికను స్థానిక ఒక ప్రముఖ హోటల్కు అత్యవసరంగా మార్చారు. బర్తరఫ్ తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మీటింగ్కు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కొండా అనుచరులు, ముఖ్య నేతలు తరలివచ్చారు.
హైకమాండ్ హామీలు.. ఢిల్లీ పయనంపై ఉత్కంఠ
కాంగ్రెస్ అధిష్ఠానం సురేఖను బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు త్వరలోనే కేబినెట్ స్థాయి కలిగిన ఒక ముఖ్యమైన పదవిని కేటాయించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తీవ్ర ప్రచారం సాగుతోంది. స్థానిక హోటల్లో కార్యకర్తలతో పూర్తిస్థాయిలో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కొండా సురేఖ నేరుగా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధిష్ఠానంతో జరిగే చర్చల తర్వాతే కొండా ఫ్యామిలీ తమ తదుపరి అడుగుపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

