Kishan Reddy Letter To CM KCR To Attend Telangana Liberation Day: భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన ఏడాది తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చిన తెలంగాణ గడ్డపై స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానుండగా.. గౌరవ అతిథులుగా ఈ కార్యక్రమంలో హాజరు కావాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైలకు కిషన్ రెడ్డి లేఖలు రాశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ వరకు.. నాటి అరాచక పాలనపై పోరాటం చేసి, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో కిషన్ రెడ్డి కోరారు.
సీఎం కేసీఆర్కి కిషన్ రెడ్డి రాసిన లేఖ:
గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకి నమస్కారములు,
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఎందరో వీరులు, వీరాంగనలు చేసిన అనుపమైన త్యాగాలను స్మరించుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. మన దేశ వైభవోపేతమైన చరిత్రలో చోటు దక్కించుకోలేని స్వాతంత్ర్య పోరాట అపూర్వఘట్టాలను గుర్తించి, వాటికి సరైన గౌరవాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో.. నాటికి అస్తిత్వంలో ఉన్న 562 సంస్థానాలు భారత ప్రభుత్వంలో కలిసేందుకు అంగీకారం తెలిపాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే దాన్ని ప్రతిఘటించింది. అయితే.. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడాది తర్వాత అంటే, 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాలకు నిజాం అరాచక పాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది. ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నాటి కేంద్ర హోంమత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సమయానుగుణంగా తీసుకున్న చర్యలవల్లే ఈ ప్రాంతాలకు విమోచనం లభించింది.
ఈ గడ్డపై పుట్టిన వ్యక్తిగా, చరిత్రపై అవగాహన ఉన్న వ్యక్తిగా, నిజాంకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం గురించి స్పష్టమైన ఆకళింపు కలిగిన వ్యక్తిగా.. తెలంగాణ విమోచన ఉద్యమ ప్రాముఖ్యత మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. భారత ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన దినోత్సవ వజ్రోత్సవాల’ను ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ వరకూ.. సంవత్సరం పొడుగునా ఈ సంబరాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. సెప్టెంబర్ 17ను మహారాష్ట్ర ప్రభుత్వం ‘మరాఠ్వాడా ముక్తి సంగ్రామ్ దివస్’గా, కర్ణాటక ప్రభుత్వం ‘హైదరాబాద్-కర్ణాటక విమోచన దినోత్సవం’గా జరుపుకుంటున్నాయి. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో, తెలంగాణ విమోచనంలో మన పెద్దలు చేసిన త్యాగాలను, వారి శౌర్య, పరాక్రమాలను ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. 2022 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంగీకరించారు.
ఈ సందర్భంగా.. ఈ కార్యక్రమానికి మీరు గౌరవ అతిథిగా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. ఇందుకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం మా కార్యాలయ అధికారులు తెలంగాణ సీఎంవోతో సమన్వయ పరుస్తారని తెలియజేస్తున్నాను.
దీంతోపాటు.. విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మన తెలంగాణ పోరాటయోధులను స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించగలరని మనవి చేస్తున్నాను. అలాగే.. వివిధ ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మీ అమూల్యమైన సూచనలను కేంద్ర ప్రభుత్వంతో పంచుకోగలరని కోరుతున్నాను. ఈ మహత్కార్యంలో మీ స్పందనకై ఎదురుచూస్తున్నాను’’ అంటూ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మరి.. ఇందుకు సీఎం కేసీఆర్ ఎలాంటి బదులిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.