హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు క్రాఫ్ట్స్ మేళాను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామీణ, గిరిజన ప్రాంతాల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. కరోనా మహమ్మారిని ఎదిరించడానికి అతిపెద్ద వ్యాక్సినేషన్ నిర్వహించుకున్నామని, మా తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను అనగానే మోడీ గారు వెంటనే అనుమతి ఇచ్చారన్నారు. రాజమండ్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని, దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఈ ఉత్సహాల్లో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు.
ఈ మహోత్సవాల్లో గిరిజన కళాకారులకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కొన్ని స్టార్ట్ అప్ కంపెనీల ఆలోచనలను కూడా స్టాల్ గా పెట్టె అవకాశం ఇచ్చామని, ఘంటసాల వంద సంవత్సరాల ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. బాల సుబ్రహ్మణ్యం, సిరివెన్నెల ను స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సంస్కృతి, కళలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేసామన్నారు. మూడు రోజుల పాటు అర్ధ రాత్రి పన్నెండు గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.