తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది.. పలు అంశాలపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మొదట చర్చ సాగింది.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇవ్వడం జరిగిందని, అర్హులైన అందరికీ అతి త్వరగా వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు.. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహాయం తీసుకోని వారితో సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైద్యారోగ్యశాఖ మంత్రిని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్నిజిల్లాల మంత్రులు కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు..
మరోవైపు, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ ., మరియు., వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై.., కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన… మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ‘‘ మన ఊరు – మన బడి ’’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ఇక, సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్.సి.ఆర్.ఐ) లో బి.ఎస్సీ. ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్ ను ప్రభుత్వం అందిస్తున్నది. ఎఫ్.సి.ఆర్.ఐ. లో విద్యనభ్యసించిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్’ (ఎ.సి.ఎఫ్.) విభాగంలోని ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు, ‘ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్’ (ఎఫ్.ఆర్.ఒ.) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు, ‘‘ఫారెస్టర్స్’’ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ (1997) మరియు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (2000) లలో సవరణలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణలో ‘ఫారెస్ట్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేబినేట్ అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను కేబినేట్ కు అందించగా, వచ్చే కేబినేట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.
