Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి కేవలం 4 వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని చెప్పడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు. సీఎం “హిట్లర్ కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని.. పేదలు, ఆడపిల్లలకు విద్యను దూరం చేసే విధానాలను అవలంబిస్తున్నారని” ఆరోపించారు.
విద్యాశాఖపై ముఖ్యమంత్రి పూర్తిగా పట్టు కోల్పోయారని కవిత విమర్శించారు. విద్యాశాఖను ఒక సర్కస్లా మార్చేశారని వ్యాఖ్యానించారు. ఇంటర్మీడియట్ విద్యా విధానంపై సీఎం చేసిన ప్రకటనలకు, విద్యాశాఖ చర్యలకు మధ్య సమన్వయం లేదని పేర్కొన్నారు. ఒకవైపు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదని ప్రకటిస్తే, మరుసటి రోజే ఇంటర్ బోర్డు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిందని గుర్తుచేశారు. జూనియర్ కళాశాలలు ప్రారంభమై వారం రోజులు గడిచినా.. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇప్పటికీ అఫిలియేషన్లు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రభుత్వం గందరగోళంగా మార్చిందని విమర్శించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒకరకమైన కోర్సులను సిఫార్సు చేస్తే, కమిషనరేట్ మరోరకమైన కోర్సులను సూచించిందని.. అయితే వాటిలో ఏ ఒక్కదానికి కూడా విశ్వవిద్యాలయాలు ఆమోదం ఇవ్వలేదని తెలిపారు. అయినప్పటికీ దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.
గురుకుల పాఠశాలల్లో వంద మందికి పైగా విద్యార్థులు మృతి చెందిన ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. అలాగే ఫీ రీయింబర్స్మెంట్ బకాయిల అంశాన్ని ప్రస్తావించిన కవిత.. రూ.11 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే నేరుగా ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెబుతూ జీవో నెంబర్-7ను తీసుకువచ్చారని అన్నారు. ఈ జీవో వల్ల ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను దోపిడీ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్-7ను వెంటనే రద్దు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

