దేశంలో రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారతీయ రైల్వే సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కవచ్ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చేపట్టింది. భద్రత, దాని సామర్థ్యం పెంపు కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ప్రపంచ స్థాయి టెక్నాలజీ కవచ్ అందుబాటులోకి రావడం వల్ల రైల్వే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా అవి ఢీకొట్టుకునే అవకాశాలు ఉండవని చెప్తున్నారు. కవచ్ టెక్నాలజీ కారణంగా అల్లంత దూరంలోనే రెండు రైళ్లు వాటికి అవే బ్రేకులు వేసుకుని ఆగిపోతాయని అధికారులు వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం లింగంపల్లి-వికారాబాద్ మార్గంలో కవచ్ ట్రయల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు ఛైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ ట్రయల్ విజయవంతం అయ్యిందని అధికారులు తెలిపారు. ఒకే పట్టాలపై ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు రైళ్లలో.. ఒక దానిలో రైల్వే మంత్రి, మరో దానిలో రైల్వే బోర్డు చైర్మన్ ఎక్కగా.. అధికారులు టెస్ట్ డ్రైవ్ చేశారు. ఒకే పట్టాలపై ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు రైళ్లు వాటి మధ్య దూరం 380 మీటర్లు ఉండగానే..వాటిలో అప్పటికే అమర్చిన కవచ్ అలెర్ట్ అయిపోయింది. రెండు రైళ్లు వాటికవే బ్రేకులేసుకుని నిలిచిపోయాయి.
