JNTU Hyderabad : JNTUHలో పదవుల పోరు.. బలి అవుతున్న విద్యార్థుల భవిష్యత్తు?

  • 'స్టాండ్ విత్ వీసీ' పేరుతో నిరసనలు
  • రిజిస్ట్రార్ నియామకంపై రగులుతున్న వివాదం
  • పాఠాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యమా?
  • JNTUH ప్రతిష్టపై పెరుగుతున్న ఆందోళనలు
Jntuh

Jntuh

తెలంగాణలోనే ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ అయిన జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUH) ప్రస్తుతం తీవ్ర వివాదాలు, వర్గపోరుతో రగిలిపోతోంది. రోజువారీ బోధన, విద్యార్థుల భవిష్యత్తును దిద్ది తీర్చాల్సిన యూనివర్సిటీ ప్రాంగణం.. అధికారిక పోరాటాలు, రాజకీయ ఒత్తిళ్లు, పరస్పర ఆరోపణలతో రాజకీయాఖాడాగా మారిపోయింది.

‘స్టాండ్ విత్ వీసీ’ నిరసనలు.. విమర్శలు

రిజిస్ట్రార్ నియామకం చుట్టూ సాగుతున్న రాజకీయ ఒత్తిళ్లపై వైస్ ఛాన్సలర్ (VC) కిషన్ రెడ్డి ఇటీవల తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడం క్యాంపస్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. వీసీకి మద్దతుగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ఏకమై ‘స్టాండ్ విత్ వీసీ’ (Stand With VC) పేరుతో క్యాంపస్‌లో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. మెజారిటీ ఫ్యాకల్టీ, సిబ్బంది తనవైపే ఉన్నారని నిరూపించుకుంటూ వీసీ ఈ ప్రదర్శనల ద్వారా తన బలాన్ని చాటుకున్నారు. అయితే, ఈ సన్నివేశంపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వీసీ కంటతడి పెట్టడం కేవలం సానుభూతి కోసమేనని, అదంతా ఒక డ్రామా అని వారు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

పాఠాలు పక్కనపెట్టి రాజకీయాలా?

పదవుల కోసమే ఈ వివాదం నడుస్తోందా లేదా దీని వెనుక కొందరు మాజీ కీలక అధికారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నారా అనేది యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. కొన్ని వర్గాలు ఫ్యాకల్టీ సభ్యులే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తుండగా, విద్యా సంస్థ పరిపాలనలో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువైందని అనుకూల వర్గాలు భావిస్తున్నాయి. కానీ, అసలు పాఠాలు చెప్పాల్సిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విధులను పక్కనపెట్టి ర్యాలీల్లో పాల్గొనడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పట్టించుకోని వీసీ, ఇప్పుడు తన స్వార్థం కోసం ఇలా ర్యాలీలు నిర్వహించుకోవడం ఆశ్చర్యకరంగా ఉందంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

దిగజారుతున్న ప్రతిష్ట.. ఎవరిది ఈ ఎజెండా.?

రాష్ట్రంలోనే అత్యున్నత సాంకేతిక విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన JNTUH ప్రతిష్టను కొంతమంది తమ వ్యక్తిగత వైరి, పదవుల పోరాటం కోసం దిగజారుస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్‌లో విద్యా వాతావరణం దెబ్బతిని, అభిప్రాయాలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. విద్యాబోధన, పరిశోధనల కంటే రోజూ ఏదో ఒక వివాదమే వార్తల్లో నిలవడం వర్సిటీ ప్రతిష్టను మసకబారుస్తోంది. అసలు JNTUHలో అమలవుతున్న ఎజెండా ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తును పక్కనపెట్టి పదవుల పండగ చేసుకుంటున్న ఈ వివాదం మున్ముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.