Site icon NTV Telugu

Jagtial: జగిత్యాల పంచాయితీ కొలిక్కి వచ్చినట్టేనా..?

Jagityal

Jagityal

ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవిపై నెలకొన్న సందిగ్ధత ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి , ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజధానిలోని ‘ప్రజాభవన్’కు చేరింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చైర్మన్ పీఠం తమ వర్గానికే దక్కాలని ఇద్దరు నేతలు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , ఏఐసీసీ కార్యదర్శి సవంత్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే ప్రజాభవన్ వేదికగా ఇద్దరు నేతలతో విడివిడిగా భేటీలు జరిగాయి, తద్వారా జగిత్యాల పంచాయితీ ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఈ చర్చల్లో ఇద్దరు నేతలు తమ తమ వాదనలను బలంగా వినిపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి వెన్నంటి ఉన్న పాత కార్యకర్తలకు, నమ్మకస్తులకే చైర్మన్ పదవి కేటాయించాలని జీవన్‌రెడ్డి పట్టుబడుతున్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించినప్పటికీ, మొదటి నుండి పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు, సంఖ్యా బలం పరంగా తన వర్గానికే ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వాదిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం నుండి 22 మంది గెలవగా, జీవన్‌రెడ్డి వర్గం నుండి 18 మందే గెలిచారని, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్న తమకే చైర్మన్ పదవి ఇవ్వడం న్యాయమని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారు చైర్మన్ పదవి కోసం పట్టుబట్టడంతో పార్టీలో ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది.

ఈ ఉత్కంఠకు తెరదించేందుకు అధిష్టానం ఒక మధ్య మార్గ పరిష్కారాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా చైర్మన్ పదవిని రెండున్నర ఏళ్లు ఒక వర్గానికి, మిగిలిన రెండున్నర ఏళ్లు ఇంకొక వర్గానికి ఇచ్చేలా ‘టర్మ్ షేరింగ్’ ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చైర్మన్ పదవి ఒకరికి ఇస్తే, వైస్ చైర్మన్ పదవిని రెండో వర్గానికి కేటాయించి ఇద్దరినీ సంతృప్తి పరచాలని చూస్తున్నారు. ఇప్పటికే జీవన్‌రెడ్డి తన కౌన్సిలర్లతో భేటీ ముగించుకుని వెనుదిరగగా, ప్రస్తుతం సంజయ్ కుమార్ వర్గంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. పార్టీలో చీలిక రాకుండా అందరినీ కలుపుకుపోయేలా అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం కోసం జగిత్యాల రాజకీయ వర్గాలు వేచి చూస్తున్నాయి.

India vs Pakistan: దాయాదులతో పోరు.. వర్షం విలన్ అవుతుందా? మ్యాచ్ రద్దవుతుందా? కొలంబో వాతావరణంపై తాజా అప్ డేట్

Exit mobile version