కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పక్కా… వెనక్కి తగ్గేదేలేదని కుండబద్దలు కొట్టేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాసిన ఆయన.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా, కానీ, 3-4 రోజులు టైం తీసుకొని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారు.. అందుకే ఆగానని.. సమయం తీసుకున్నా రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్నారు.. ఎవరికీ భయపడేది లేదు, ఎవరికీ జంకేది లేదు.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే లైన్ తీసుకున్నాను.. నేను పార్టీలో ఉండి ఎందుకు ఇబ్బంది పడాలి, కాంగ్రెస్కు ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.. నేను చిన్నతనం నుండే రాజకీయాలు చేశా.. చదువు కంటే సర్వీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానన్న ఆయన.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నా స్వభావం.. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడను అన్నారు.. రాజకీయాల్లో పోటీ సహజం.. ప్రయత్నం చేయడం సహజమేనని.. కోపం ఉన్నా ఎదురుగానే చెప్తా, ఓ వ్యక్తి సిస్టంని పాడు చేస్తుంటే తప్పని చెప్తా అన్నారు.
Read Also: Devineni Uma: మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డ దేవినేని.. రేయ్ కొడాలి..!
నేను స్టేట్ ఫార్వర్డ్ గా ఉంటా కాబట్టి.. నాపై మీడియా అటెన్షన్ ఉంటుందన్నారు జగ్గారెడ్డి… నేను ఒకే విషయంలో డిస్ట్రబ్ అయ్యా.. నా వల్లనే పార్టీ డిస్ట్రబ్ అవుతుంది అని చర్చ చేస్తున్నారని.. దానిపై నేను సైలెంట్గా ఉండటం మంచిది అనుకున్న .. కోవర్ట్ అనే ముద్ర వేసి ప్రచారం చేయడం నాకు బాధ అనిపించింది.. దీంతో, పార్టీ వదిలి వెళ్లాలని అనుకున్నానని స్పష్టం చేశారు.. నా వల్ల పార్టీ ఇబ్బంది పడటం ఎందుకు అని వెళ్తున్నాను.. గతంలో తెలంగాణ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన నేను.. అలాంటి సందర్భంలో కూడా నేను అనుకున్న విషయం ఓపెన్ గా చెప్పినాని గుర్తుచేసుకున్నారు.. తెలంగాణ ఆనాడు వద్దు అని చెప్పా.. దాని గురించి మరో సందర్భంలో మట్లాడతాను అన్నారు. జగ్గారెడ్డి వల్ల పార్టీ దెబ్బతీస్తుంది అని సోషల్ మీడియాలో రాయిస్తున్నారు.. నా మీద బురద జల్లుతున్నరు.. కాబట్టే నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నానని స్పష్టం చేశారు.. ఇక, సోనియా, రాహుల్ కుటుంబం గొప్ప చరిత్ర కలిగిన కుటుంబం.. అందుకే సీఎం కేసీఆర్.. అస్సాం సీఎం కామెంట్స్ పై స్పందించారని అభిప్రాయపడ్డారు జగ్గారెడ్డి..
ఇక, నేను పార్టీ మారాలి అనుకుంటే ఎప్పుడో మారేవాడిని అంటూ వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి.. కోవర్టు అని చర్చ చేయడంతోనే బాధ కలుగుతోందన్న ఆయన.. ఇంకే పార్టీలోకో పోవాలని కాదు.. ఇండిపెండెంట్గా ఉండాలని అనుకున్నాను.. నేను పార్టీ వీడటం వల్ల పార్టీకి నష్టం ఏం లేదు.. పార్టీకి నాయకులు ముఖ్యం కాదు.. చాలా మంది వస్తుంటారు.. పోతుంటారన్నారు.. నా ఇమేజ్ కాపాడుకోవడం నాకు ముఖ్యం అని తెలిపిన జగ్గారెడ్డి.. పార్టీ ముఖ్యులు కొందరు రాజీనామా వద్దు.. ఆలోచన చేయండి అని అన్నారు.. రెండు మూడు రోజులు అగుతా.. అందరినీ ఒప్పించి.. రాజీనామా చేసి బయటకు వస్తా అన్నారు.. నేను పార్టీ విడిచి పెట్టినా.. సోనియా, రాహుల్ గాంధీలకు మర్యాద పూర్వకంగా ఉంటానని ప్రకటించారు. ఇక, ఓ ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రిని కలవొద్దా..? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.. మంత్రి కేటీఆర్ నా నియోజకవర్గానికి వస్తే కలిస్తే తప్పా అని ప్రశ్నించిన ఆయన.. టీఆర్ఎస్ కంటే ముందు.. మా వాళ్లే బదనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రతిపక్షాలు, అధికార పార్టీకి చెందినవారిని కలవడం తప్పు అవుతుందా? అని నిలదీసిన ఆయన.. మెడికల్ కాలేజీ విషయంలో మూడేళ్లు కొట్లాడి సాధించినా.. మెడికల్ కాలేజీ ఇస్తే సీఎంకి కృతజ్ఞత చెప్పినా.. అది తప్పు అవుతుందా? చిన్న పిల్లల చేష్టలు ఎందుకు అని నిలదీశారు.. ఇక, పైరవీ చేసుకోవడం తప్పు కాదు.. పీసీసీ తెచ్చుకోవడం తప్పు కాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. టీ కప్పులో తుఫాన్ అంటే రాజీనామా చేయాలనే ఉద్దేశం అన్నారు జగ్గారెడ్డి..
