Site icon NTV Telugu

High alert in Old City: పాతబస్తీలో భద్రత పెంపు.. భారీగా మోహరించిన ఆర్ఏఎఫ్ బలగాలు

Hyderabad

Hyderabad

High alert in Old City: ఇవాళ శుక్రవారం కావడంతో చార్మిన్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా ఆర్ ఏఎఫ్ పోలీసుల బలగాలను మోహరించారు. నేడు శుక్రవారం కావడంతో.. ముస్లీంలు మక్కామసీదు ప్రార్థనలకు రానున్నారు. ఈనేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం వున్నందున పోలీసులు భారీగా మోహరించారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పాతబస్తీలో భద్రతను మరింత పెంచారు. ఇవాళ శుక్రవారం కావడంతో చార్మినార్, మక్కామసీదు పరిసరాల్లో సుమారు 5 వేల మంది ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉండటంతో అదనపు బలగాలను మోహరించారు. తమ ఇళ్లకు దగ్గర్లో ఉన్న మసీదుల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టేవారిని గుర్తిస్తున్నామని.. ఇప్పటికే ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీపీ ఆనంద్ వెల్లడించారు.

ప్రజలకు పోలీసుల హెచ్చరిక రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో గానీ, బయటగానీ ఎవరైనా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలుచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఏ మతానికి చెందిన వారైనా సరే..ఒక వర్గాన్ని కానీ మతాన్నికానీ కించపరిచేలా, అవమానపరిచేలా సోషల్ మీడియాలో కామెంట్లు చేసినా.. మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version