HYDRAA : హైదరాబాద్ మహానగర పరిధిలో అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) అధికారులు తమ ఉక్కుపాదాన్ని కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ ఎత్తున జరిగిన ప్రభుత్వ భూమి ఆక్రమణలపై అధికారులు శుక్రవారం ఉదయం మెరుపు దాడి చేశారు. ఎయిర్పోర్ట్ కాలనీ పరిసరాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పక్కన ఉన్న సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో పూర్తిగా కూల్చివేశారు.
ఈ ఐదెకరాల ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది భూస్వాములు, కేటుగాళ్లు కబ్జా చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే పక్కా నిర్మాణాలను లేపారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. కూల్చివేతల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా , బాధితుల నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల పహారా మధ్య హైడ్రా సిబ్బంది అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి, సదరు ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ , దాని చుట్టుపక్కల శివారు ప్రాంతాలలో చెరువులు, నాలాలు, , ప్రభుత్వ భూములను ఆక్రమణల నుండి కాపాడటమే లక్ష్యంగా హైడ్రా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఎంతటి రాజకీయ పలికుబడి ఉన్నవారైనా సరే, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలిపెట్టేది లేదని ఈ చర్య ద్వారా అధికారులు మరోసారి స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి హై-ప్రొఫైల్ ఏరియాలో జరిగిన ఈ కూల్చివేతల కలకలం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
