Kovvur – Bhadrachalam Railway Project: 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కొవ్వూరు – భద్రాచలం రైల్వే ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. రైల్వే సమస్యలపై సికింద్రాబాద్ లోని రైల్వే జీఎం శ్రీవాస్తవతో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి భేటీ అయిన సందర్భంగా ఈ ప్రాజెక్టుపై ఆరా తీశారు. సర్వే జరిగినప్పటికీ పనులు పూర్తవ్వలేదన్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా ఇవ్వాల్సి ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం వలన సత్తుపల్లి వరకు చేశామని, ఏపీ ప్రభుత్వం కూడా ఇస్తే పూర్తిచేస్తామని జీఎం శ్రీవాస్తవ వివరణ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిసి, నియోజక వర్గ పరిధిలోని రైలు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.
రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఆరు మాసాలు కావస్తున్నా, ఇంకా టెండర్లు పిలవలేదని జీఎం దృష్టికి ఎంపీ పురందేశ్వరి తీసుకొచ్చారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచి, మొదటి దశ పనులు వెంటనే ప్రారంభిస్తామని జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ హామీ ఇచ్చారు. కరోనాకు ముందు వరకు కొవ్వూరు రైల్వే స్టేషన్ లో 18 రైళ్లు ఆగేవని, ఇప్పుడు 8 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయన్నారు. ముఖ్యంగా చెన్నై, తిరుపతి వెళ్ళడానికి కూడా రైళ్లు ఆగడం లేదని, సింహాద్రి ఎక్స్ ప్రెస్ కూడా ఆపడం లేదని ఎంపీ పురందేశ్వరి ప్రస్తావించారు. ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన తిరుమల, సర్కారు, సింహాద్రి ఎక్స్ ప్రెస్ వంటి రైళ్లన్నీ ఆగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: UP: యూపీలో ఘోరం.. ప్రేమికుడి కోసం కన్నకూతుర్ని చంపేసిన ఇల్లాలు
ఇదే విధంగా రాజమండ్రి నుంచి తణుకు, భీమవరం, నరసాపురం వరకు ప్యాసింజర్ రైళ్లు ఉండేవని, కరోనా సమయంలో వీటిని ఆపేశారని, తిరిగి పునరుద్ధరించాలని ఎంపీ పురందేశ్వరి కోరగా జీఎం సానుకూలంగా స్పందించారు. నిడదవోలు జంక్షన్ లో 150 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిఫికేషన్ పనులు, ఫ్లాట్ ఫారం 4, 5 పనులు కూడా పూర్తయినప్పటికీ మెయిన్ లైన్ లో కలపడానికి అవసరమైన ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసి పనులు పూర్తిచేయాలని ఎంపీ పురందేశ్వరి కోరారు.