SBI ATM Gun Fire: హైదరాబాద్ నగరంలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎమ్ వద్ద ఈరోజు (శనివారం) ఉదయం తీవ్ర కలకలం చోటు చేసుకుంది. గన్తో కాల్పులు జరిపిన అఘాంతకులు రూ.6 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బులెట్ గాయం కావడం కలకలం రేపింది. ఉదయం 7 గంటల సమయంలో రషీద్ అనే వ్యక్తి ఏటీఎమ్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అతడిని ముందుగానే గమనించిన దుండగులు వెనక నుంచి ఫాలో అయ్యారు. రషీద్ ఏటీఎమ్ దగ్గరకు చేరుకున్న వెంటనే అతడిపై గన్తో కాల్పులు జరిపి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
Read Also: 9500s చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా, భారీ బ్యాటరీతో ఫిబ్రవరిలోనే Xiaomi 17T Series లాంచ్?
అయితే, కాల్పుల్లో రషీద్కు కాలికి బులెట్ గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎమ్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగదు దోపిడీతో పాటు కాల్పులు జరగడంతో కోఠి ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
