Harish Rao Vs Seethakka: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హరీష్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిస్తూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. దీంతో హరీష్ రావు వర్సెస్ సీతక్క వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లింది.
Read also: Telangana Assembly Live 2024: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
సర్పంచ్లకు చెల్లించాల్సిన రూ.691 కోట్లు గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయని హరీష్ రావు గుర్తు చేశారు. నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే ఎక్కడికక్కడ సర్పంచ్ లను అరెస్టు చేశారని తెలిపారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించింది బడా కాంట్రాక్టర్లకు అన్నారు. బడా కాంట్రాక్టర్లకు రూ. 1200 కోట్లు.. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు మాత్రం ఒక్క పైసా కూడా అందలేదని తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు ముందు పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, ఎప్పుడు క్లియర్ చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Read also: Harish Rao: బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ, సర్పంచులకు లేదు..
అనంతరం హరీష్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. 2014 నుంచి సర్పంచ్ ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, గత ప్రభుత్వం ఆ బిల్లులు ఎందుకు చెల్లించలేకపోయిందో సమాధానం చెప్పాలన్నారు. సర్పంచ్ బిల్లుల గురించి అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ రోజు తమకేమీ తెలియనట్లు బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడంతో బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క సరైన సమాధానం చెప్పలేదని బీఆర్ ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. వాకౌట్ అనంతరం తిరిగి అసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
Kaushik Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలి.. కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
