Site icon NTV Telugu

CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. దేశ భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన.. “దేశం కోసం, మన అందరి కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. గత ఐదేళ్లుగా ఆయన చేసిన నిరంతర పోరాటాల ఫలితంగానే నేడు రాహుల్ గాంధీ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు. దేశంలోని అనేక సమస్యలపై ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడమే మన తదుపరి లక్ష్యం కావాలి” అని స్పష్టం చేశారు.

Read Also: Tollywood Heros: యంగ్ హీరోల సినిమాలకూ బడ్జెట్ రిస్కేనా ?

తన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.. తాను ZPTC నుండి సీఎం అయ్యాను అని తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 19 ఏళ్ల స్వల్ప కాలంలోనే ZPTC స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని, ఎమ్మెల్యేగా, పార్టీలో వివిధ పదవుల్లో పనిచేసి ఎంతో అనుభవం గడించానని తెలిపారు. తన ప్రజా జీవితంలో ఎప్పుడూ పైరవీలకు తావివ్వలేదని, కేవలం ప్రజా సమస్యల పైన గళం వినిపించడమే తన పనిగా పెట్టుకున్నానని చెప్పారు.

ప్రజా పక్షాన నిలబడటం వల్ల తనపై ఎన్నో కేసులు పెట్టారని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. “ప్రజా సమస్యల మీద పోరాటం చేసినందుకు నాపై ఎన్నో కేసులు పెట్టారు, పరువు నష్టం దావాలు వేశారు. నిన్న కూడా నేను కోర్టుకు హాజరయ్యాను. కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీపై ఉన్న నమ్మకమే ప్రధాన కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ పేరుతోనే మనం రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్నామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటమే మన మార్గం.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మన గమ్యం అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

Exit mobile version