హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న భారీ దందాను టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పంజాగుట్టలోని ఒక శ్మశాన వాటికను అడ్డాగా చేసుకుని, అక్కడ సిలిండర్లను నిల్వ ఉంచి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాపై డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలోని బృందం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 414 గ్యాస్ సిలిండర్లతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 11 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శంషాబాద్లో గ్యాస్ గోదాంను, అఫ్జల్గంజ్లో కార్యాలయాన్ని నిర్వహిస్తూ గత ఏడాదిన్నర కాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్కు చెందిన మహమ్మద్ అమీర్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తుండగా, అతనితో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం ఇరాక్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడనుందనే తప్పుడు ప్రచారాన్ని నిందితులు ఆసరాగా చేసుకున్నారు. మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి, రూ. 2 వేల చిల్లర ఉండే కమర్షియల్ సిలిండర్ను ఏకంగా రూ. 6 వేల పైచిలుకు ధరకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. పక్కా సమాచారంతో నిందితులపై నిఘా ఉంచిన టాస్క్ఫోర్స్ పోలీసులు, శ్మశాన వాటికలో దాచి ఉంచిన వివిధ రకాల హెచ్.పీ గ్యాస్ సిలిండర్లను (47 కిలోలు, 19 కిలోలు , 5 కిలోలవి) బయటకు తీశారు. ప్రజల అవసరాలను పెట్టుబడిగా మార్చుకుని అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను తదుపరి విచారణ నిమిత్తం సివిల్ సప్లై విభాగానికి అప్పగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
