ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు దేశ వ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో సైతం కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అయితే ఇటీవలే మళ్లీ విద్యా సంస్థలను పునః ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హై కోర్టు విచారణ చేపట్టింది. విద్యా సంస్థల్లో ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని హై కోర్టు ఆదేశించింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ బోధన కొనసాగించాలన్న హైకోర్టు.. హైదరాబాద్ లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో హైకోర్టు కు చెప్పాలని, సమ్మక్క జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని హై కోర్టు పేర్కొంది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి హైకోర్టు తెలిపింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని హై కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించి, కరోనా పరిస్థితులపై విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.