CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు

  • హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్
  • ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్
  • యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీపై ఫోకస్
  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం
Cm Revanth

Cm Revanth

తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక మైలురాయిని దాటింది. ప్రపంచ ప్రఖ్యాత ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ వచ్చే డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను అందించనుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమొరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్ సహా 30 మంది ప్రతినిధులతో కూడిన యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఫ్యూచర్ సిటీలో 30 వేల ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్

మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో, దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. అందులోనే అత్యుత్తమ ఎడ్యుకేషన్ హబ్‌ను, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ, హార్వర్డ్, వర్జీనియా టెక్ వంటి ఐవీ లీగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్ షోర్ క్యాంపస్‌లు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులను అందించేలా భాగస్వామ్యాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. గ్లోబల్ విద్యాసంస్థల రాకతో ప్రపంచ స్థాయి కార్పొరేట్ దిగ్గజాల చూపు తెలంగాణ వైపు మళ్లుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గ్లోబల్ సమ్మిట్ 2026కు యూకే బృందానికి ఆహ్వానం

దావోస్ తరహాలోనే డిసెంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ కు రావాల్సిందిగా యూకే విద్యా రంగానికి చెందిన ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయని, ఇప్పటికే టీసీఎస్ రూ. 70 వేల కోట్లతో అతిపెద్ద ఏఐ డేటాసెంటర్, అమెజాన్ రూ. లక్ష కోట్ల పెట్టుబడితో డేటాసెంటర్ నిర్మాణాలు చేపడుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషా నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ప్రపంచ స్థాయి అవకాశాలను కల్పిస్తామన్నారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీలు , యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.