రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతు విప్పుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బురద రాజకీయాలకు తెరలేపారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జ్యేష్ఠ నాయకుడు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాలను, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎంతో పాటు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. శాసనసభ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఒక పక్కా పథకం ప్రకారం సస్పెన్షన్కు పాల్పడ్డారని మండిపడ్డారు.
రూల్స్ పేరుతో కాలయాపన.. సస్పెన్షన్ వెనుక పెద్ద కుట్ర!
గతంలో రాహుల్ గాంధీ సైతం లోక్సభకు టీ షర్టుపై స్టిక్కర్ వేసుకుని వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. లోక్సభ నిబంధనలు వేరు, అసెంబ్లీ నియమావళి వేరంటూ ప్రభుత్వం సాకులు చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. తామేమీ అసెంబ్లీలోకి నిషేధిత పదాలు లేదా బూతు వ్యాఖ్యలు రాసుకున్న టీషర్టులు వేసుకుని రాలేదని, ప్రజా సమస్యలపై నిరసన తెలపడం తమ ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. తాము సభలో ఉంటే ప్రభుత్వ కుంభకోణాలు, వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే తమను కుట్రపూరితంగా సస్పెండ్ చేశారని విమర్శించారు.
సస్పెన్షన్ ఎత్తివేస్తే సభకు వస్తాం
మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై సభలో ప్రశ్నించినందుకే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగారని హరీష్ రావు ఆరోపించారు. తమ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సస్పెన్షన్ అస్త్రాన్ని ప్రయోగించారని పేర్కొన్నారు. అన్యాయంగా విధించిన సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేస్తే తాము తిరిగి సభకు వచ్చి ప్రజల తరఫున నిలబడతామని తమ పార్టీ సభ్యులు ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఎంతకాలం అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

