Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే

  • 22Aపై మంత్రి తీరును తప్పుపట్టిన హరీశ్ రావు
  • ముఖ్యమంత్రి ఇంటిపై సంచలన ఆరోపణలు
  • రూ.50 లక్షలకే భూమి ఇస్తాం.. కొనండి అంటూ సవాల్
  • ‘అగ్గిపెట్టె రావు’ వ్యాఖ్యలపై హరీశ్ తీవ్ర ఆగ్రహం
Harish Rao

Harish Rao

శాసనసభలో 22A నిబంధనలపై జరిగిన చర్చలో ప్రజలకు ఎలాంటి ఉపశమనం లభించలేదని, సభ సాక్షిగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాల ప్రవాహాన్ని పారించారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటే 22A అక్రమాలపై గట్టిగా నిలదీస్తుందనే భయంతోనే తమకు మైక్ ఇవ్వకుండా, ఏకపక్షంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. తమను సభ నుంచి బయటకు పంపి, మంత్రి సుదీర్ఘ ప్రసంగం చేస్తూ ఎదురుదాడికి దిగారే తప్ప, తాము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయారని ధ్వజమెత్తారు.

సభను పక్కదోవ పట్టించారు.. తప్పు ఒప్పుకున్నా క్షమాపణ లేదు

22A జాబితా వల్ల రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ప్రజల ఆస్తులు నిలిచిపోయాయో స్పష్టం చేయాలని తాము ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం దాటవేసారని హరీశ్ రావు ఆరోపించారు. అయితే, జాబితాను సరిగ్గా వెరిఫై చేయకుండానే 22Aలో భూములను చేర్చామని చెప్పడం ద్వారా మంత్రి సభలో తప్పు జరిగినట్లు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. పొరపాటు జరిగిందని అంగీకరించిన మంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పకపోగా తమపై ఎదురుదాడి చేయడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి ఇంటిని మాత్రం రాత్రికి రాత్రే 22A నిషేధిత జాబితా నుంచి తొలగించుకున్నారని, ఇదేనా ప్రజా ప్రభుత్వ పాలన అని ప్రశ్నించారు.

మా మామగారి భూమిపై అవాస్తవాలు.. రూ.50 లక్షలకే ఇస్తాం తీసుకోండి

తమ కుటుంబ సభ్యుల భూములపై మంత్రి పొంగులేటి సభలో అర్ధసత్యాలు మాట్లాడారని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తన మామగారి భూమి ఉన్నది గజ్వేల్ నియోజకవర్గంలో అయితే, సిద్దిపేట అని తప్పుగా ప్రచారం చేశారని తెలిపారు. ఆ భూమికి 2010లోనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) వచ్చిందని, పక్కాగా చెక్కుల ద్వారా లావాదేవీలు జరిపి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని స్పష్టం చేశారు. ఆ భూమి ఎకరా రూ.15 కోట్లు ఉందంటూ మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, నిజంగా అంత విలువ ఉంటే ఎకరా రూ.50 లక్షలకే ఇస్తామని, మంత్రి పొంగులేటినే వచ్చి కొనుగోలు చేయాలని సవాల్ విసిరారు.

తెలంగాణ ఉద్యమకారులను అవమానించడమే

తనను ‘అగ్గిపెట్టె రావు’ అంటూ మంత్రి పొంగులేటి సంబోధించడంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి, మంత్రి పొంగులేటికి తెలంగాణ ఉద్యమ చరిత్ర, దాని తీవ్రత ఏమాత్రం తెలియదని ఎద్దేవా చేశారు. తాము ఉద్యమాలు చేసిన రోజుల్లో భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అవుతామని అనుకుని పోరాటాలు చేయలేదని స్పష్టం చేశారు. ఉద్యమంలో భాగస్వాములైన వారిని, ఉద్యమకారులను ఇలాంటి వ్యాఖ్యలతో పిలవడం తెలంగాణ సమాజాన్ని, పోరాట రక్తాన్ని అవమానించడమేనని హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.