Site icon NTV Telugu

Gadchiroli Encounter: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. రూ.25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు నేత ప్రభాకర్ హతం.!

Maoists Encounter

Maoists Encounter

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి అడవుల్లో గత మూడు రోజులుగా జరుగుతున్న భారీ ఆపరేషన్ ముగిసింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో గడ్చిరోలి డివిజనల్ కమిటీ కీలక నేత ప్రభాకర్‌తో సహా మొత్తం ఏడుగురు మావోయిస్టులు మరణించారు. ఈ పోరులో ఒక జవాన్ వీరమరణం పొందగా, మరొకరు గాయపడ్డారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తి ప్రభాకర్. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నివాసి అయిన ఈయన, సీపీఐ మావోయిస్టు సంస్థలో గడ్చిరోలి డివిజనల్ కమిటీ ఇన్‌చార్జ్, వెస్ట్ సబ్-జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్ , కంపెనీ నంబర్ 10 ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభాకర్‌పై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించిందంటే ఆయన ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

Mega Trade Deal: ఈయూ, యూఎస్ తర్వాత.. మరో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతున్న భారత్..

గత మూడు రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి నాటికి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఈరోజు సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా సంఘటనా స్థలం నుండి మరో నలుగురి (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మృతదేహాలను వెలికితీశారు. మొత్తంగా ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టులు (నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు) మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 03 AK-47 రైఫిళ్లు, 01 SLR రైఫిల్‌,
01 .303 రైఫిల్‌ ఉన్నాయి.

ఈ ఆపరేషన్ లో సీ-60 స్క్వాడ్ జవాన్ దీపక్ చిన్న మాదవి (38) అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. అహేరి నివాసి అయిన దీపక్, నిన్న సాయంత్రం జరిగిన భీకర పోరాటంలో ఒంటరిగా ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు. అయితే, ఎదురుకాల్పుల్లో బుల్లెట్ తగిలి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హెలికాప్టర్ ద్వారా భమ్రాగడ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. రేపు దీపక్ స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరోవైపు, కిష్ట్యాపల్లి నివాసి అయిన జోగా మాదవి అనే జవాన్ కూడా కాల్పుల్లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గడ్చిరోలిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని అధికారులు తెలిపారు. మరణించిన మిగిలిన మావోయిస్టుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను, మరణించిన వారి వివరాలను గడ్చిరోలి పోలీసులు రేపు నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు.

Jogi Ramesh: జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట

Exit mobile version