సిద్దిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లి భూముల వివాదంపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను అధికారికంగా ప్రారంభించారు. ఎర్రవల్లి, దాని శివారు గ్రామాలైన వెంకటపూర్ , వరదరాజుపూర్ సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న అసైన్డ్ భూములను అధికారులు శోధించి, పరిశీలిస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమగ్ర తనిఖీలు
ఏడీ సుదర్శన్, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, , మర్కూక్ ఎమ్మార్వోల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఈ క్షేత్రస్థాయి విచారణను చేపడుతున్నాయి. సర్వే నంబర్ 325 పరిధిలోని అసైన్డ్ భూములు ప్రస్తుతం ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, ఎవరు కబ్జా చేశారనే విషయాలపై అధికారులు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి, వెంకటపూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలోని పలు కీలక సర్వే నంబర్లలో భూముల కొలతలు , పరిశీలన ప్రక్రియ పూర్తయింది.
385 ఎకరాల అసైన్డ్ భూముల్లో కబ్జాల గుర్తింపు
ఏ సర్వే నంబర్లో ఎంత మేర భూమి విస్తరించి ఉంది, అందులో ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ పట్టా భూమి ఎంత అనే కీలక వివరాల సేకరణలో రెవెన్యూ సిబ్బంది నిమగ్నమయ్యారు. మొత్తం 385 ఎకరాల అసైన్డ్ భూమి పరిధిలో ఎంత మేర ఆక్రమణలు లేదా కబ్జాలకు గురయ్యిందనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల అనంతరం సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.

