గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. నిర్బంధపాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ప్రజాసంక్షేమ విధాన పత్రమే గవర్నర్ ప్రసంగం. దీనిమీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు.
కానీ సీఎం కేసీఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు. గవర్నర్ కే దిక్కులేకుండా చేస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవుతుంది. మైకులు కట్ చేసి అవమానిస్తారు. మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో అనే అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు దక్కింది. మేము ముగ్గురం కావొచ్చు . కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వం.రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుందన్నారు ఈటల రాజేందర్.
అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం. కేసీఆర్ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి. లేదంటే రేపు మీకు కూడా అదే గతి పడుతుంది.
